Omicron Fears | దేశీయ స్టాక్ మార్కెట్లను సోమవారం ఒమిక్రాన్ భయాలు వెంటాడాయి. న్యూ వేరియంట్ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. సోమవారం ఉదయం 57,778.01 పాయింట్ల ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కొనుగోలుదారుల నుంచి ఏమాత్రం మద్దతు లభించలేదు. ట్రేడింగ్ స్తబ్దుగా కొనసాగడంతో ఇంట్రాడే ట్రేడింగ్లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్ ఒకానొక దశలో 56,777.04 కనిష్టానికి తాకి, తిరిగి 56,747.14 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 ఇండెక్స్లో షేర్లన్నీ నష్టపోయాయి.
ఇప్పటివరకు ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో బలహీనత ఎంపిక చేసిన ఆటో, ఫైనాన్సియల్ స్క్రిప్ట్లపైన పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 284.40 పాయింట్లు పతనమై 16,912.30 పాయింట్ల వద్ద నిలిచింది. 1340 స్క్రిప్టులు పతనమైతే, 1948 షేర్లు లాభపడ్డాయి. 165 స్టాక్స్ స్థిరంగా ఉన్నాయి. యూపీఎల్ మినహా నిఫ్టీ-50 ఇండెక్స్లోని షేర్లన్నీ పతనమయ్యాయి. కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ భారీగా నష్టపోయిన స్ట్రిప్టులు.
బీఎస్ఈ-30 ఇండెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ భారీగా నష్టపోయిన స్టాక్స్, భారతీ ఎయిర్టెల్ 3, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.8 శాతం నష్టపోయాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2.5-2.9 శాతం మధ్య నష్టపోయాయి. ఇంకా రెడ్డీస్ ల్యాబ్స్, ఆసియన్ పెయింట్స్, మారుతి, ఎన్టీపీసీ తదితర స్టాక్స్ గణనీయంగా పతనం అయ్యాయి.
బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.5 శాతం, ఎనర్జీ, టెలికం ఇండెక్స్లు రెండు శాతం, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, ఆటో, రియాల్టీ ఇండెక్స్లు 1.5 శాతానికి పైగా నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి 30 పైసలు నష్టపోయి 75.42 వద్ద నిలిచింది. ఒమిక్రాన్ భయాలతోపాటు అమెరికా పెడ్ రిజర్వు ద్రవ్య పరపతి ఔట్లుక్ కూడా మదుపర్ల సెంటిమెంట్ను బలహీన పరిచింది. ఫలితంగా యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.