వ్యూహం లేదు.. విజన్ అంతకన్నా ఉండదు. సంక్షేమం కానరాదు.. చివరకు సర్కారీ సంస్థలూ మిగలవు. అవును.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆలోచనంతా ఇప్పుడొక్కటే. అందినకాడికి అమ్ముకొని సొమ్ముచేసుకోవాలన్న ఆరాటమే అది. ఇందుకోసం చట్టాలనూ మారుస్తున్నది. వ్యవస్థల్నీ ఏమారుస్తున్నది. తుదకు పంతం నెగ్గించుకుంటున్నది. తాజాగా ఎంతో అమూల్యమైన రైల్వే భూములను దీర్ఘకాలం లీజుకిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు క్యాబినెట్ ఆమోదం కూడా జరిగిపోయింది. మరోవైపు ఆర్సీఎఫ్, ఎన్ఎఫ్ఎల్ సహా 8 ప్రభుత్వ రంగ ఫర్టిలైజర్ సంస్థల్ని ప్రైవేటుకు అప్పజెప్పేందుకూ కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: భారత రైల్వేల పరిధిలోని విలువైన భూములపై నరేంద్ర మోదీ సర్కార్ కన్ను పడింది. ఈ భూములను ప్రైవేట్ సంస్థలకు దీర్ఘకాలిక లీజు కింద ధారాదత్తం చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం ముద్ర వేసింది. ఇప్పటికే పలు రైల్వే రూట్లను ప్రైవేట్ పరం చేసిన కేంద్ర సర్కార్ తాజాగా పీఎం గతి శక్తి పథకం కింద 35 ఏండ్ల గరిష్ఠ కాలపరిమితితో లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం లీజు కాలపరిమితి ఐదేండ్లు ఉండగా, దీనిని ఏకంగా 35 ఏండ్లకు పెంచడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఈ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా 300 రైల్వే కార్గో టర్మినళ్లు నిర్మిస్తామని, 1.25 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని క్యాబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. రూ.1,957 కోట్లతో కోచి మెట్రో రైల్వే రెండో దశ ప్రాజెక్టు చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెకండ్ ఫేజ్లో 11 స్టేషన్లతో 11 కిలోమీటర్ల పొడవున మెట్రో నెట్వర్క్ నిర్మిస్తారు.
ల్యాండ్ లీజు ఫీజు తగ్గింపు
మరోవైపు, ల్యాండ్ లీజు ఫీజును కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం 6 శాతం ఫీజును వసూలు చేస్తుండగా..దీనిని 1.5 శాతానికి తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఒకవైపు భూములను తెగనమ్ముతున్న మోదీ సర్కార్..మరోవైపు ప్రైవేట్ సంస్థలకు ఆర్థికంగా సహాయ సహాకారాలు అందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ల్యాండ్ ఫీజును ఎక్కువ చేసి వసూలు చేయాల్సింది పోయి..ఏకంగా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కంటైనర్ల కోసం రైల్వే స్థలాల లీజు ఫీజును 3 శాతం కంటే తక్కువగా ఉంచాలన్న నీతి ఆయోగ్ సిఫార్స్లకు అనుగుణంగా క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీ కరణకు మార్గం సుగమం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లీజుకు ఇచ్చే భూముల్లో లాజిస్టిక్ సదుపాయాలు, డ్రై పోర్ట్స్, కంటైనర్ సరుకు స్టేషన్లు, ప్రైవేట్ టర్మినళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.
18 ఎకరాలు లీజుకిస్తాం
టెండర్లు ఆహ్వానించే యోచనలో దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రైల్వే అధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాలను డెవలప్మెంట్ (కమర్షియల్) కోసం లీజుకు ఇవ్వడానికి తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతుంది. గత ఏడాది నుంచి ఎస్సీఆర్ ఆధ్వర్యంలో ఉన్న స్థలాలను డెవలప్మెంట్ ఇవ్వడానికి అనుకూలమైన స్థలాలను గుర్తించడానికి సర్వే నిర్వహించారు. ఇప్పటికే చిలకలగూడ ఆధ్వర్యంలో ఉన్న దాదాపు 18 ఎకరాల భూమిని కూడా కమర్షియల్ అభివృద్ధి కోసం ప్రైవేటు వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. దాదాపు 50 లేదా 99 ఏండ్ల వరకు ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే అవకాశాలు ఉన్నాయని ఎస్సీఆర్ జోన్ అధికారులు తెలియజేస్తున్నారు.
ప్రయాణికుల రైళ్లు ప్రైవేటుపరం
ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్న కేంద్రం చివరకు ప్రయాణికుల రైళ్లను సైతం ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమయ్యింది. 150 జతల ప్రయాణీకుల రైళ్లను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నడిపేందుకు ప్రైవేటు సంస్థల నుంచి తొలిసారిగా రైల్వే శాఖ బిడ్స్ను ఆహ్వానించింది. ఈ పీపీపీ ప్రక్రియ ద్వారా ప్రైవేటు రంగం నుంచి రూ.30,000 కోట్ల ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతుందని అంచనా. ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త భోగీలతో నడిపేందుకు 150 జతల ప్రయాణికుల రైలు సర్వీసుల్ని తొలుత రైల్వే శాఖ గుర్తించింది. ఇది విజయవంతమైతే తదుపరి ఈ సంఖ్య ను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వివరాలివి…
రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ
పీపీపీ పద్దతిలో ప్రయాణీకుల రైళ్లను నడిపేందుకు తాము బిడ్స్ను ఆహ్వానించలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది.
దేశీయ ఎరువుల రంగంలో ప్రభుత్వ సంస్థల్నే లేకుండా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అన్ని రంగాలను ప్రైవేట్ బాట పట్టిస్తున్న మోదీ సర్కారు.. ఇప్పుడు కీలకమైన ఎరువుల కంపెనీలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్), నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) తదితర 8 సంస్థలను అమ్మకానికి గుర్తించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో సర్కారీ సంస్థలను ప్రైవేటీకరించే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ పెద్దలంతా ఇప్పుడు ఒక్కదగ్గరికి చేరారు. నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ నాయకత్వంలో ఎడతెగని రీతిలో జరుగుతున్న ఈ చర్చల్లో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) సీనియర్ అధికారులంతా తలమునకలయ్యారు. ఈ పీఎస్యూల అమ్మకపు ప్రతిపాదనలకు ప్రభుత్వ సంస్థలు, ఎరువులు, ఆర్థిక వ్యవహారాల శాఖల్లోని ఉన్నతాధికారులూ సమావేశమయ్యారు. తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉండగా, ఆ పని పూర్తయితే సొమ్ము చేసుకొనేందుకు కేంద్రం రంగంలోకి దిగనున్నది.
చట్టాలు మార్చి..
కనిపించిన ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్మాలని ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకోసం చట్టాలను మారుస్తున్నదీ, కొత్త విధానాలనూ తెస్తున్నది. 2020 మే 17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నూతన ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని ప్రకటించారు. ఈ విధానం ప్రకారం వ్యూహాత్మకేతర రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించుకోవచ్చు. అలా కుదరనిపక్షంలో సంస్థల్ని మూసేయవచ్చు. లేదా ఇతర సంస్థల్లో విలీనం కూడా చేయవచ్చు. దీంతో ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొనే ఈ ప్రైవేటీకరణకు మోదీ సర్కారు దిగుతున్నది. కాగా, అమ్మకానికి వస్తున్న ఈ 8 సంస్థల్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటాలున్నాయి. ఆర్సీఎఫ్లో 75 శాతం వాటాను కలిగి ఉన్న కేంద్రం.. ఎన్ఎఫ్ఎల్లో 74.71 శాతం, ఎఫ్ఏసీటీలో 90 శాతం, మద్రాస్ ఫర్టిలైజర్స్లో 85.27% వాటాను కలిగి ఉన్నది.
ఎరువుల ధరలకు రెక్కలే
భారత్ అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రధాన దేశం. అలాంటిదిప్పుడు కేంద్ర ప్రభుత్వం.. ఉన్న సర్కారీ ఎరువుల సంస్థలన్నింటినీ ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నది. ఇదే జరిగితే ఎరువుల ధరలు రెక్కలు తొడగడం ఖాయమన్న ఆందోళనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఫర్టిలైజర్ ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ధరల్ని నియంత్రణలో పెట్టాల్సిన ప్రభుత్వమే ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నదని రైతాంగంలోనూ ఆందోళన కనిపిస్తున్నదిప్పుడు. ఎరువుల తయారీ ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉంటే ధరలు పెరుగుతాయని, పంటల సాగు ఖర్చూ పెరిగి ఆహారోత్పత్తుల ధరలు పరుగులు పెడతాయని ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు. విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచుతుందని, ఫలితంగా రుణాలు భారమై అన్ని రంగాలు, జీడీపీ పతనానికి దారితీస్తాయని అంటున్నారు.
ప్రైవేటీకరించే పీఎస్యూలివే..