Mobiles Exports | మన దేశం నుంచి విదేశాలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. దేశీయంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ)లు ఇవ్వడంతో 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం 2022-23లో మొబైల్ ఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులతో పోలిస్తే భారత్ నుంచి స్మార్ట్ఫోన్ ఎగుమతులు రెట్టింపయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), అమెరికా, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇటలీలకు అత్యధికంగా భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి.
దేశీయంగా విక్రయిస్తున్న స్మార్ట్ ఫోన్లలో 97 శాతానికి పైగా భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీదారుగా భారత్ నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
గతేడాది 2022లో చైనా 80-85 శాతం ఐ-ఫోన్లు తయారు చేసింది. అయితే, భారత్లో 2027 నాటికి 45-50 శాతం ఐ-ఫోన్లు ఉత్పత్తి అవుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. 2022లో మొత్తం ఐ-ఫోన్ల ఉత్పత్తిలో భారత్ వాటా 10-15 శాతం మాత్రమే. గతేడాది డిసెంబర్లో భారత్ 100 కోట్ల డాలర్ల విలువ గల ఐ-ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం భారత్లో ఐ-ఫోన్12, ఐఫోన్ 13, ఐఫోన్14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. చైనా నుంచి విదేశాలకు స్మార్ట్ ఫోన్ల తయారీ మళ్లించడం వల్ల భారత్, వియత్నాంలకు భారీగా లబ్ధి చేకూరుతుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.