న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ-పీఏఎంపీ.. తెలంగాణసహా దక్షిణాది రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో 15 రిటైల్ స్టోర్లను ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది. బీఐఎస్ ఆమోదించిన దాదాపు వెయ్యి మంది స్థానిక జ్యుయెల్లర్లతో భాగస్వామి అవుతామని స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి 20 శాతం ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా, ప్రస్తుతం దక్షిణాదిలోని 7 ప్రధాన నగరాల్లో ఎంఎంటీసీ-పీఏఎంపీ రిటైల్ ఔట్లెట్లున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో సంస్థకు విశేష ఆదరణ ఉన్నది. దీంతో కస్టమర్లకు డిజిటల్, భౌతిక బంగారం పెట్టుబడుల ఆప్షన్స్ను ఇవ్వాలనీ సంస్థ చూస్తున్నది. కాగా, పరిమిత ఎడిషన్లో భాగంగా 20 గ్రాముల్లో 999.9 స్వచ్ఛత కలిగిన నాణేలను స్థానికతను ప్రతిబింబించేలా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో వికాస్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.