హైదరాబాద్, ఏప్రిల్ 5: ఆడియో ఎలక్ట్రానిక్స్ సంస్థ మివీ (ఆవిశ్కరణ్ ఇండస్ట్రీస్).. హైదరాబాద్లోని తుక్కుగూడ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఉత్పత్తి కేంద్రానికి శుక్రవారం భూమిపూజ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీఎంవో మిధుల దేవభక్తుని మాట్లాడుతూ.. ఏడు ఎకరాల స్థలంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానునున్నట్లు, తద్వారా మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
ఇప్పటికే శంషాబాద్లో ఉన్న యూనిట్ను భవిష్యత్తులో ఇక్కడికి తరలించే ప్రతిపాదన కూడా ఉన్నదన్నారు. వచ్చే ఐదేండ్లలో రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన ఆమె..ఇందుకోసం కొత్తగా మరో మూడు విభాగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఐవోటీ పరికరాలు, కెమెరా, టీవీల విభాగాల్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఈ యూనిట్లోనే ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్లో డ్రైవెన్, పీసీబీఏ, బ్యాటరీలతోపాటు ఆడియో ఉత్పత్తులు, ఇయర్ఫోన్లు, సౌండ్బార్లు, స్పీకర్లు, గేమింగ్ యాక్సససీరిస్లు తయారుకానున్నాయన్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో ఆన్లైన్ వాటా 90 శాతం కాగా, ఆఫ్లైన్ వాటా 10 శాతంగా ఉన్నదన్నారు. ప్రస్తుతం సంస్థ రూ.999 మొదలుకొని రూ.16 వేల లోపు ధర కలిగిన పలు ఉత్పత్తులను విక్రయిస్తున్నది.