PAN Card – Aadhar Link | ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పాన్ కార్డు కీలకం. వ్యక్తిగత గుర్తింపు కోసం తీసుకొచ్చిన ‘ఆధార్’తో పాన్ కార్డును అనుసంధానం చేస్తేనే ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. రూ.1000 ఫైన్ చెల్లించి వాటి అనుసంధానం చేసుకోవడానికి గత నెలాఖరుతో గడువు ముగిసింది. కానీ, ఈ గడువు లోపు అనుసంధానించని పాన్ కార్డులు నిరుపయోగం అవుతాయని ఇంతకుముందే ఆదాయం పన్ను విభాగం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తేల్చి చెప్పాయి. అయినా.. పాన్-ఆధార్ కార్డులను అనుసంధానించని వారు.. తమ ఆధార్తో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి సీబీడీటీ మరో అవకాశం కల్పించింది.
గత నెలాఖరుతో పాన్-ఆధార్ అనుసంధాన ప్రక్రియ మిస్సయిన వారు ముందుగా పెనాల్టీ రూ.1000 చెల్లించి తమ పాన్ కార్డు పునరుద్దరించుకోవచ్చు. అయితే, దీనికి 30 రోజులు పడుతుంది. అప్పటి వరకు నిరుపయోగంగా మారిన పాన్ కార్డుతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేరని గత మార్చి 28న సీబీడీటీ ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది.
సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం ముందుగా రూ.1000 ఫైన్ పే చేయాలి. అటుపై పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అటువంటి వారు ఆదాయం పన్ను విభాగం అధికారిక పోర్టల్ లోని ఈ-పే టాక్స్ సెక్షన్లోకి పెనాల్టీ చెల్లించాలి. అటుపై ఆధార్-పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి నెల రోజుల తర్వాత పాన్-ఆధార్ అప్డేట్ అవుతుంది. ఉదాహరణకు ఈ నెల ఐదో తేదీన ఫైన్ చెల్లించి, పాన్ కార్డు-ఆధార్ లింక్ కోసం దరఖాస్తు చేస్తే, ఆగస్టు నాలుగో తేదీ లోగా అప్ డేట్ అవుతుంది.