హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 23వ బయో ఏషియా (2026) వార్షిక సదస్సును మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ రంగ సేవలను ప్రజలకు అందుబాటులో, చౌకగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. ఇక ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు.
అంతకుముందు సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా సదస్సు.. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం తనకుందన్నారు. హైదరాబాద్ను సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం అని పిలుపునిచ్చారు. ఈసారి సదస్సు ‘టెక్బయో అన్లీష్డ్-ఏఐ, ఆటోమేషన్ అండ్ ది బయాలజీ రెవల్యూషన్’ థీమ్తో జరుగుతున్నది.
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో క్యాన్సర్ జీన్ థెరపీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బ్రూస్ లెవిన్కు జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు-2026ను సీఎం చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈ సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్లు.. లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్లతో భేటీ అయ్యారు. రూ.1,700 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.