హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులోని జేసీకే హారిజాన్ ఇండస్ట్రియల్ పారులో ఏర్పాటు చేసిన జేహ్ ఏరోస్పేస్ సంస్థను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఆ సంస్థను కోరారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఎండీ విశాల్ సింఘ్వీ మాట్లాడుతూ..రూ.23 కోట్ల పెట్టుబడితో ఈ ఏరోస్పేస్ సెంటర్ను ప్రారంభించామని, రానున్న నాలుగు నెలల్లో 100 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇక్కడ తయారైన ఏరోస్పేస్ విడిభాగాలను అమెరికా ఎగుమతి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ర్టానికి దిగ్గజ ఫుడ్ ఇండస్ట్రీ
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎనర్జీ, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు చెందిన పలు పశ్రమలు ముందుకొచ్చాయని శ్రీధర్బాబు తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ దిగ్గజ ఆహార పరిశ్రమ తెలంగాణలో భారీ సంఖ్యలో రెస్టారెంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు చెప్పారు.