హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, హైదరాబాద్ నగరాభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన 250 మంది రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందంతో శనివారం టీ-హబ్లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పాలసీలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి మంత్రి వివరించారు. బహుముఖ వ్యూహం తో హైదరాబాద్ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతోపాటు లైఫ్సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకునేలా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ఐటీలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించిన విషయాన్ని గుర్తుచేశారు.
పరిశ్రమలకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేయడానికి టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల కోసం టీఎస్ బీపాస్ వంటి విప్లవాత్మకమైన పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటి అధ్యయనానికి అనేక రాష్ర్టాలు వచ్చాయని, తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను.. దేశం రేపు అనుసరిస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ను గెలిపిస్తే.. అక్కడ సైతం అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రెడాయ్ ప్రతినిధులు జీ రాంరెడ్డి, సీ శేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహారాష్ట్ర క్రెడాయ్ ఉపాధ్యక్షులు సునీల్ కొత్వాల్తోపాటు పెద్ద సంఖ్యలో క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని మహారాష్ట్ర క్రెడాయ్ ప్రతినిధులు అన్నారు. గత పదేండ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయని, సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని వ్యాఖ్యానించారు. పాలకులకు సరైన విజన్ ఉంటే.. నగరమైనా, రాష్ట్రమైనా ఎంతగానో అభివృద్ధి చెందుతుందనడానికి తెలంగాణ అభివృద్ధే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో హైదరాబాద్ నగరం బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా అభివృద్ధి చెందిందనడానికి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు రుజువని పేర్కొన్నారు. ‘గత మూడు రోజులుగా నగరంలోని చాలా ప్రాంతాలను సందర్శించా.. ఎంతో అద్భుతంగా ఉన్నది. ఇలాంటి అభివృద్ధి, పథకాలు, విధానాలు మహారాష్ట్రలోనూ వస్తే బాగుంటుంది’ అన్నారు.