హైదరాబాద్, ఫిబ్రవరి 3 : అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ తెలంగాణలో తన సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ.. కొత్తగా వరంగల్, ఖమ్మంలో కేంద్రాలను తెరువనున్నట్టు వెల్లడించింది. ఈ నాలుగు కేంద్రాల్లో కలిపి కొత్తగా 1,400 మందిని నియమించుకోనున్నట్టు స్పష్టం చేసింది. సీఈవో కార్తీక్ పొల్సాని నేతృత్వంలో ఎక్లాట్ గ్రూప్ ప్రతినిధులు బృందం గురువారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. రాబోయే 18 నెలల్లో కంపెనీ విస్తరణ ప్రణాళికను వివరించారు. వరంగల్, ఖమ్మంలో గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఒక్కోచోట కనీసం 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్లోని కేంద్రాల్లో అదనపు నియామకాలు చేపడతామని, హైదరాబాద్లో 500 మందిని, కరీంనగర్లో 200 మందిని నియమిస్తామని వెల్లడించారు. ‘మెడికల్ కోడింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ సేవల్లో ఎక్లాట్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. ప్రభుత్వ సహకారంతోపాటు టాస్క్ ద్వారా మాకు నిపుణులైన మానవవనరులను అందిస్తున్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు’ అని కార్తిక్ తెలిపారు. హెల్త్కేర్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా వినూత్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్’ (టీ-ఎయిమ్)తో కలిసి పనిచేయాలని ఆసక్తితో ఉన్నామని చెప్పారు. మొదటిసారి తాము 2016లో కరీంనగర్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించామని గుర్తుచేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఎక్లాట్కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్న ఎక్లాట్కు ధన్యవాదాలు తెలిపారు.