న్యూఢిల్లీ: మీరు ఈ నెలలో లండన్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? ఈ ప్రశ్నకు మీ సమాధానం అవును అయితే మీది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎయిరిండియా సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలు ఈ నెలలో విమానచార్జీలను ( Airfare ) భారీగా పెంచాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో భారతీయులు తమ దేశంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించిన యూకే.. దేశంలో మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఇవాళ ఆంక్షలను ఎత్తివేసింది.
దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆగస్టు నెలకు సంబంధించి వివిధ విమానయాన సంస్థల నుంచి భారత్-యూకే విమాన చార్జీల సమాచారం కోరింది. విమానయాన సంస్థలు DGCAకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆగస్టులో విస్తారా ఎయిర్లైన్స్ రూ.1,03,191 గా ఉన్న చార్జీని రూ.1,21,356కు పెంచింది. అంటే ఢిల్లీ నుంచి లండన్కు ఎకానమీ క్లాసులో వెళ్లడానికి ప్రయాణికులు కనిష్ఠంగా రూ.1,21,356 చెల్లించాలన్నమాట.
అదేవిధంగా బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా రూ.1,28,916గా కనిష్ఠ చార్జీని రూ.1,47,544కు పెంచింది. ఇక ఎయిర్ ఇండియా, వర్జిన్ అట్లాంటిక్ కూడా ఢిల్లీ టు లండన్ కనిష్ఠ విమాన చార్జీలను రూ.1,15,936, రూ.1,28,916గా నిర్ణయించాయి.