అమ్మకాలకు అదే కీలకం: మారుతీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మరింత మైలేజీనిచ్చే కార్లనే అభివృద్ధిపర్చి, విడుదల చేస్తూ ఉంటామని మారుతీ సుజుకీ ప్రకటించింది. కస్టమర్లు కార్లు కొనేటపుడు ఇదే కీలకాంశమని కంపెనీ పేర్కొంది. దేశంలో అధిక ఇంధన సామర్థ్యం కలిగిన కార్లకు మూడుదశాబ్దాలుగా నేతృత్వం వహిస్తున్న మారుతీ ‘కామ్ సే కామ్ బనేగా’ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ వాహనాల పనితీరుపై ఏ మాత్రం రాజీపడకుండా ఇంధన సామర్థ్య లక్ష్యాల్ని సాధిస్తామని అన్నారు. ఇంధన ధరలు తగ్గి ఉన్నపుడు కూడా ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కొనుగోళ్లే అధికంగా జరిగాయని తమ అంతర్గత అధ్యయనాలు వెల్లడించాయని, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిన ప్రస్తుత తరుణంలో మైలేజీ ప్రాధాన్యత మరింత పెరిగిందని శ్రీవాస్తవ వివరించారు. ఇప్పట్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం లేదని, అందుచేత కస్టమర్లు మెరుగైన మైలేజీనిచ్చే వాహనం కోసమే చూస్తారని అన్నారు.
సీఏఎఫ్ఈ ప్రమాణాలు సాధించాలంటే…
వచ్చే ఏడాది నుంచి దేశంలో అమలులోకి రానున్న కఠిన సీఏఎఫ్ఈ (కార్పొరేట్ ఏవరేజ్ ఫ్యూయల్ ఎకానమీ) ప్రమాణాల్ని సాధించేందుకు కూడా ఇంధన సామర్థ్యం కలిగిన కార్లనే కంపెనీలు అభివృద్ధిపర్చాల్సి ఉంటుందని శ్రీవాస్తవ చెప్పారు. రెండోదశ సీఏఎఫ్ఈ నిబంధనలు 2022లోనూ, మూడోదశ నిబంధనలు 2027లోనూ అమలులోకి వస్తాయని, ఈ నేపథ్యంలో ప్రతీ కంపెనీ తన కార్ల ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపర్చాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రస్తుతం ధీమాగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వాహన కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సీఏఎఫ్ఈ ప్రమాణాల్ని నిర్దేశించారు. 2017 నుంచి 2022 వరకూ అమలవుతున్న మొదటిదశ సీఏఎఫ్ఈ నిబంధనల ప్రకారం సీవో2 ఎమిషన్స్ కిలోమీటరుకు 130 గ్రాముల్లోపుగా ఉండాలి. రెండోదశలో వీటిని మరింతగా 113 గ్రాముల్లోపునకు తగ్గించాలి.