హైదరాబాద్, జూలై 9 (నమస్తేతెలంగాణ): తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. రాజీనామా లేఖలో తాను టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు రమణ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. 30 ఏండ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి రమణ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాజీనామాతో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ, కీలక నేత రమణ రాజీనామాతో తుడిచిపెట్టుకుపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీలో మిగిలిన అతికొద్దిమంది కీలక నేతల్లో రమణ ముఖ్యులు. 2018లో ఆయన టీఆర్ఎస్లో చేరి జగిత్యాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అప్పట్లో చేరలేదు. టీఆర్ఎస్లో చేరి బీసీల అభ్యున్నతిలో భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రమణ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ‘నమస్తే’కు తెలిపారు. రమణతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు సమాచారం.