Microsoft | గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తున్నది. ఈ దాడులు మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారింది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఈ వారం నిరసనకు దిగారు. తక్షణమే ఇజ్రాయెల్ సైన్యంతో ఉన్న సాంకేతిక సంబంధాలకు ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ని డిమాండ్ చేశారు. అయితే, ఈ నిరసనలకు ప్రధాన కారణం బ్రిటన్కు చెందిన ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన ఓ కథనమే. ‘ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ మైక్రోసాఫ్ట్ ‘Azure క్లౌడ్ సర్వీసులు’ ఉపయోగించి గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనీయుల ఫోన్ కాల్స్ను పర్యవేక్షిస్తోందని పేర్కొంది.
అయితే, ఇదే విషయంలో మైక్రోసాఫ్ట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. దీనిపై ‘Covington & Burling’ అనే న్యాయ సంస్థ ద్వారా విచారణ చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ తన సర్వీస్ రూల్స్ ఈ విధమైన వినియోగాన్ని అనుమతించదని కంపెనీ స్పష్టం చేసింది. ఇది తీవ్రమైన విషయమని.. ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని కంపెనీ పేర్కొంది. కానీ, ఉద్యోగులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. కేవలం విచారణ చేయడం సరిపోదని.. కంపెనీ ఇజ్రాయెల్కు టెక్నాలజీ మద్దతు తక్షణమే ఆపాలని కోరుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. మైక్రోసాఫ్ట్-ఇజ్రాయెల్ రక్షణ శాఖ మధ్య బలమైన సంబంధాలున్నాయని తెలిపింది. 2023 అక్టోబర్లో జరిగిన హమాస్ దాడి తర్వాత.. ఇజ్రాయెల్ సైన్యంలో ఏఐ టెక్నాలజీ వినియోగం 200 రెట్లు పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం గూఢచర్యం, లాంగ్వేజ్ ట్రాన్స్లేట్, డేటా విశ్లేషణ వంటి కార్యకలాపాల కోసం Microsoft Azure ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తుందని, ఆ సమాచారం చివరికి AI ఆధారిత టార్గెట్ సిస్టమ్కు చేరుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ గతంలో చేసిన అంతర్గత దర్యాప్తులో అజూర్ లేదంటే ఏఐ వేదికలను ప్రజలకు హాని కలిగించేలా వాడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.
అయితే, దర్యాప్తు ఎవరు చేశారు.. ఏం చెప్పిందనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. తాజాగా ఈ అంశంలో ముగ్గురు ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఇందులో ఒకరు సీఈఓ సత్య నాదెళ్ల ప్రసంగం సందర్భంగా మైక్రోసాఫ్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగి ఉన్నారు. కంపెనీ తీసుకున్న చర్యలపై సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ నైతికంగా బాధ్యత వహించగలదా? లాభాల కోసం వివాదాస్పద భాగస్వామ్యాలను కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.