న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఎంజీ మోటర్ ఇండియా బుధవారం మార్కెట్కు ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)ను పరిచయం చేసింది. కోమెట్ పేరుతో వచ్చిన దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు (ఎక్స్షోరూం). సింగిల్ చార్జ్పై దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ చెప్తున్నది. దీంతో దేశంలో ఇదే అత్యంత సరసమైన ధర ఈవీ అన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 మోడళ్లకు పోటీగా ఉంటుందన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. గురువారం నుంచి టెస్ట్ డ్రైవ్లు, మే 15 నుంచి బుకింగ్స్, ఆ తర్వాత డెలివరీలు ఉంటాయి.
కాగా, కోమెట్.. మార్కెట్లోకి ఎంజీ మోటర్ నుంచి వచ్చిన రెండో ఈవీ. గతంలో జెడ్ఎస్ ఈవీని సంస్థ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘కోమెట్ ఈవీ ఓ కారు మాత్రమే కాదు.. అంతకు మించి. మన నగర ప్రయాణాలకు తగ్గట్టుగా దీన్ని రూపొందించాం. శైలిలోగానీ, సౌకర్యంలోగానీ ఎక్కడా రాజీ పడలేదు. ఇది కస్టమర్ల సరైన ఎంపికగా ఉంటుంది’ అని ఎంజీ మోటర్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రాజీవ్ చాబ ఓ ప్రకటనలో అన్నారు. ప్యూర్ ఎలక్ట్రిక్ జీఎస్ఈవీ వేదికపై కోమెట్ ఈవీ తయారీ జరుగుతున్నదని, ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఎన్నో ఫీచర్లను ఇందులో తెచ్చామని వివరించారు. కోమెట్ ఈవీ అభివృద్ధి కోసం దాదాపు రూ.700 కోట్ల పెట్టుబడులను ఎంజీ మోటర్ పెట్టింది. గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో కార్లు తయారవుతున్నాయి.