ముంబై: బ్రిటన్కు చెందిన కార్ల తయారీ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ (Morris Garages)కు అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) కమెట్ (Comet) ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. వారం రోజుల క్రితం ప్రివ్యూ విడుదల చేసిన ఆ సంస్థ.. తాజాగా కారు ధర, బుకింగ్ వివరాలను వెల్లడించింది. కారు ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన వాహనాల కోసం చూస్తున్న అన్ని వయసుల వారికి అనుకూలంగా ఎంజీ మోటార్ ఇండియా ఈ కారును తీసుకొచ్చింది.
ఈ ఎంజీ కమెట్ కారుకు సంబంధించిన బుకింగ్స్ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో ఇదే కంపెనీ ZS EV కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో కారు. ఎంజీ మోటార్ ఇండియా తీసుకొచ్చిన ఈ కమెట్ ఎలక్ట్రిక్ కారు వివిధ వేరియంట్లలో లభ్యమవుతుంది. కానీ, వేరియంట్ల వారీగా ధరల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇందులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
ఈ కారు ఛార్జింగ్ కూడా చాలా త్వరగా పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. 3.3 kW ఛార్జర్తో 7 గంటల్లో బ్యాటరీ 100 పర్సెంట్ అవుతుందని, 80 శాతం ఛార్జింగ్కు ఐదు గంటలు పడుతుందని పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తున్న ఈ కారులో ముందు వైపు రెండు ఎయిర్బ్యాగ్స్ ఇస్తున్నారు. రెండు డోర్లు మాత్రమే ఉండే ఈ కారులో నాలుగు సీట్లు ఉంటాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సర్, ఎల్ఈడీ రియర్ ఫాగ్ ల్యాంప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.
నగరాల్లో కస్టమర్ల కోసమే ఈ కారు..
ఎంజీ మోటార్ ఇండియా నగరాలు, పట్టణాల్లో నివసించే కస్టమర్లను ఉద్దేశించి ఈ కారును తీసుకొచ్చింది. రోజుకు 100 కంటే తక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లకు కమెట్ అనువుగా ఉంటుందని కంపెనీ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా చెప్పారు. ప్రస్తుతం భారత్లో విద్యుత్ వాహనాల సంఖ్య 2 శాతంగా ఉందని, త్వరలోనే ఈ సంఖ్య 10 శాతానికి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. రూ.10 లక్షల్లోపు ఎలక్ట్రిక్ వాహనం కోసం చూసే కస్టమర్లకు కమెట్ ఈవీ మంచి ఎంపిక అవుతుందన్నారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ EC3 ఎలక్ట్రిక్ కార్లకు కమెట్ పోటీ ఇస్తుందని చెప్పారు.