MG Motor-Reliance | విభిన్న రంగాల్లోకి వ్యాపారాలు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా ఆటోమొబైల్ రంగంలో కూడా ప్రవేశిస్తుందా? అంటే.. అవుననే సమాధానమే వస్తున్నది. బ్రిటిష్ కార్ల తయారీ బ్రాండ్.. చైనా ఆటో జెయింట్ ఎస్ఏఐసీ యాజమాన్యంలో పని చేస్తున్న ఎంజీ మోటార్ ఇండియా.. సంస్థలో మెజారిటీ వాటా వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు సరైన సంస్థలకు ఈక్విటీ విక్రయించడానికి ఎంజీ మోటార్ ఇండియా చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నాయని సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో గ్రూప్, ప్రేమ్ జీ ఇన్వెస్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సంస్థలతో ఎంజీ మోటార్ ఇండియా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ సంస్థ వర్గాల కథనం.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారతదేశంలో తాజా పెట్టుబడులు పెట్టడానికి ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్య సంస్థ ‘ఎస్ఏఐసీ’కి రెగ్యులేటరీపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తదుపరి దశ గ్రోత్ సాధనకు, స్థానిక భాగస్వాములను కూడగట్టుకోవాలని ఎంజీ మోటార్ ఇండియా తలపోస్తున్నది. గుజరాత్ రాష్ట్రంలో కార్లు.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రూ.5000 కోట్ల పెట్టుబడులు అవసరం.
భారత్ కంపెనీలతో ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్యం ఎడతెగని సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం ఖరారు కావచ్చునని ఆ సంస్థ వర్గాల కథనం. విశ్వసనీయమైన భాగస్వామి కోసం ఎంజీ మోటార్ ఇండియా ఎదురు చూస్తున్నది. 2028 నాటికి గుజరాత్ లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రూ.5000 కోట్ల పెట్టుబడులు అవసరం. తద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్యం సంప్రదింపులపై స్పందించడానికి రిలయన్స్, హీరో గ్రూప్, ప్రేమ్ జీ ఇన్ వెస్ట్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిరాకరించాయి.