మార్కెట్ పల్స్
భారీ పతనంతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీగానే రికవరీ అయ్యాయి. గత వారం 1,085 పాయింట్ల రేంజ్లో ట్రేడైన ప్రధాన సూచీ నిఫ్టీ చివరికి 385 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 2.2 శాతం లాభంతో ముగిస్తే.. మిడ్క్యాప్ 2.5 శాతం, స్మాల్క్యాప్ 4.2 శాతం లాభాలతో ముగిశాయి. వీక్లీ చార్ట్లో నిఫ్టీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ను ఏర్పాటు చేసి నాలుగు వారాల పతనానికి చరమగీతం పాడింది. మార్కెట్ స్థితి డౌన్ట్రెండ్ నుంచి ర్యాలీ ప్రయత్నంలోకి మారింది. అయితే గత రెండు రోజులుగా 200 రోజుల చలన సగటు రెసిస్టెన్స్గా మారింది. గురువారం నాటి రేంజ్లోనే శుక్రవారం ట్రేడ్ కావడం, గురువారం గరిష్ఠ స్థాయిని అధిగమించి ముగియకపోవడంతో ర్యాలీ కాస్త ముగింపు దశకు వచ్చిందా? అన్న సందేహాలకు తెరలేపింది. స్పల్పకాలిక ట్రెండ్ ఇండికేటర్ 20 రోజుల చలన సగటు 16,766 వద్ద ఉన్నది. 16,692-766 స్థాయిలను అధిగమించి ముగిస్తే తదుపరి లక్ష్యం 17,065. ఇదే స్థాయిలో దిగువముఖ చానెల్ రెసిస్టెన్స్తోపాటు 50 రోజుల చలన సగటుగా ఉన్నది. ఇదిలాఉండగా, 16, 447-470 స్థాయిలకు దిగువన ముగిస్తే మార్కెట్ మళ్లీ డౌన్ ట్రెండ్ను ప్రారంభిస్తుంది. కాగా, ప్రధాన ఇండికేటరు ఆర్ఎస్ఐ, ఎంఏసీడీలు ఇంకా బుల్లిష్ సంకేతాలను ధృవీకరించలేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం మరింత ముదిరితే మార్కెట్లో ఒడిదుడుకులు భారీగా ఉంటాయి. మెటల్, షుగర్ ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు ఈ వారం పాజిటివ్గా ట్రేడ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.
మళ్లీ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్
గతంలో మంచి రాబడులను అందించిన పరాగ్ పరేఖ్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్.. నిధుల సమీకరణకు సబ్స్క్రిప్షన్ను పునఃప్రారంభించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం విదేశీ మార్కెట్లలో మదుపు పరిమితి మించిపోతున్నందున వాటిల్లో పెట్టుబడులు ఆపేయాలని సెబీ నిర్ణయించడంతో దేశీయ మార్కెట్లోనే మదుపు చేసేందుకు నిధులను సమీకరించనున్నట్టు పరాగ్ పరేఖ్ మ్యూచువల్
ఫండ్ తెలిపింది. ఇటీవలి మార్కెట్ పతనంతో ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న షేర్ల వాల్యూయేషన్లు ఆకర్షణీయంగా మారాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకే పునఃప్రారంభించినట్టు చెప్పింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో విదేశీ షేర్లలో మదుపు పరిమితిని ఇప్పుడప్పుడే సెబీ పెంచకపోవచ్చు. దీంతో దేశీయంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆదరణ పొందిన ఫ్లెక్సీక్యాప్ ఫండ్ స్కీమ్ను అనుమతిస్తున్నది.