న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..ప్రస్తుతేడాదిపై గంపెడు ఆశలు పెట్టుకున్నది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్తో ఈ ఏడాది విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశం ఉన్నదని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత కార్ల విక్రయాలు ఊపందుకున్నాయన్నారు. 2022లో సంస్థ 15,822 యూనిట్ల విక్రయాలు జరిపింది. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లోనే 8,528 యూనిట్లు విక్రయించినట్టు, ప్రస్తుత పండుగ సీజన్లో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
దేశీయ ఆటోమొబైల్ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎక్సేంజ్ రేటు, వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉండటంతో వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నదన్నారు. అయినప్పటికీ కంపెనీ మాత్రం రెండంకెల వృద్ధి సాధిస్తున్నదన్న ధీమాను వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక్క శాతం మాత్రమేనని, 2023లో 45 వేల యూనిట్లు అమ్ముడయ్యాయంటే అదే గొప్ప విషయమని చెప్పారు. ఇటీవలకాలంలో నూతనంగా కార్లను కొనుగోలుచేసేవారు పెరిగారని, మహిళలు, వేతన ఉద్యోగులు కూడా లగ్జరీ కార్లకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.