న్యూఢిల్లీ, జనవరి 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. 2023లో 17,408 యూనిట్ల వాహనాలను విక్రయించిన సంస్థ..ఈ ఏడాదిపై గంపెడు ఆశ పెట్టుకున్నది. దేశీయంగా లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 12 కొత్త మాడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నూతన వాహనాలు, డిజిటలైజేషన్, ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. వీటిలో మూడు ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు టాప్ ఎండ్ వాహనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
వీటి ధర రూ.1.5 కోట్ల కంటే అధికంగా ఉండనున్నాయన్నారు. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టి 30 ఏండ్లు పూర్తైందని, ఇప్పటి వరకు రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు ఆయన చెప్పారు. దీంట్లోభాగంగానే ఈ ఏడాది కొత్త మాడళ్లను అభివృద్ధి చేయడానికి పుణె ప్లాంట్ రూ.200 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గడిచిన మూడేండ్లుగా భారత్లో కంపెనీ విక్రయాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని, 2022లో 15,822 యూనిట్లు, 2023లో 17,408 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 3 వేల ఆర్డర్లు ఉన్నాయని, వీటిని త్వరలో కస్టమర్లకు అందచేయనున్నట్లు ప్రకటించారు.
మార్కెట్లోకి నయా జీఎల్ఎస్ మాడల్
మార్కెట్లోకి నయా జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభించనున్న ఈ కారు రూ.1.32 కోట్లు, రూ.1.37 కోట్ల ధరలో లభించనున్నాయి. మల్టీ-జోన్ ైక్లెమేట్ కంట్రోల్, డ్యూయల్-డిజిటల్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 3 లీటర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్తో రూపొందించిన ఈ కారు బీఎండబ్ల్యూ ఎక్స్7, ఆడీ క్యూ8, రేంజ్రోవర్ స్పోర్ట్, వోల్వో ఎక్స్సీ90లకు పోటీగా విడుదల చేసింది.