హైదరాబాద్, జనవరి 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)..తెలంగాణతో సహా 9 రాష్ర్టాల్లో 15 సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్ని చేజిక్కించుకుంది. దేశంలో 65 భౌగోళిక ప్రాంతాల్లో సీజీడీ ప్రాజెక్టుల కోసం పెట్రోలియం, సహజవాయువుల శాఖ నిర్వహించిన 11వ రౌండ్ బిడ్డింగ్లో అత్యధిక ప్రాజెక్టుల్ని పొందామని ఎంఈఐఎల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మొత్తం 43 ప్రాంతాలకు బిడ్స్ వేశామని, 15 ప్రాంతాల్లో ప్రాజెక్టులకు విజయవంతమైన బిడ్డర్గా నిలిచినట్టు కంపెనీ వివరించింది. సీజీడీ ప్రాజెక్ట్ కింద సిటీ గ్యాస్ స్టేషన్లు లేదా మదర్ స్టేషన్లను నిర్మించడం, ప్రధాన పైప్లైన్తో పాటు పంపిణీ పైప్లైన్లు వేయడం, సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటుచేయడం వంటివి ఉంటాయి.
తెలంగాణలో..: రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి భౌగోళిక ప్రాంతాలకు సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుల్ని పొందినట్టు ఎంఈఐఎల్ తెలిపింది.