హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఐర్లాండ్కు చెందిన మెడికల్ టెక్నాలజీ సేవల సంస్థ మెడ్ట్రానిక్..హైదరాబాద్లో తాజాగా ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పింది. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం ప్రారంభించారు. అమెరికా బయట సంస్థకు ఇదే అతిపెద్ద రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) సెంటర్ కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, సీఈవో జియోఫ్ మార్థా మాట్లాడుతూ..వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగానే ఇక్కడ ఆర్ అండ్ డీ సెంటర్ను నెలకొల్పినట్లు చెప్పారు.
వచ్చే ఐదేండ్లలో రూ.3 వేల కోట్లు( 350 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంస్థ..దీంట్లో భాగంగానే ఆర్ అండ్ డీని మరింత విస్తరించింది. అలాగే ఉద్యోగుల సంఖ్యను 1,500కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ఆర్అండ్టీ టీం కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రాంతీయ ఇన్నోవేషన్ ఎకోసిస్టాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రోగులకు మెరుగైన సేవలు నేరుగా అందించడానికి వీలు పడనున్నదని, హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు పడినట్లు అవుతున్నదన్నారు. గ్లోబల్ హెల్త్కేర్ దిగ్గజమైన ఎంఈఐసీ..2011లో హైదరాబాద్లో అడుగుపెట్టింది.