న్యూఢిల్లీ, మార్చి 5: దేశవ్యాప్తంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. 2023లో 8.1 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరుకోగా, ఈ ఏడాది రూ.2.55 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ, ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ రంగం రూ.3 లక్షల కోట్లు దాటనున్నదని అంచనావేస్తున్నది.
డిజిటల్ మీడియా జోషే కారణం. 2022లో రూ.70,900 కోట్లుగా ఉన్న టెలివిజన్ రంగం ఆ తర్వాతి ఏడాదిలో 1.83 శాతం తగ్గి రూ.69,900 కోట్లకు పడిపోయింది. అలాగే 2023లో రూ.65,400 కోట్లుగా ఉన్న డిజిటల్ మీడియా రంగం ఈ ఏడాది రూ.75,100 కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనావేస్తున్నది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది 13.5 శాతం వృద్ధితో రూ.95,500 కోట్లకు చేరుకోనున్నదని తెలిపింది.