Maruti Suzuki | కార్ల ధరలు పెరగడంతో మున్ముందు బుల్లి కార్లకు మళ్లీ ప్రాధాన్యం వస్తుందని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చి చెప్పారు. మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కార్ల తయారీ ప్రారంభించినప్పటి నుంచి ఫస్ట్టైం కారు కొనుగోలు దారు బుల్లి కార్ల వైపే మొగ్గు చూపే వారు. క్రమంగా టెక్నాలజీ సరికొత్త ఫీచర్లు అందిస్తుండటంతో తమ అభిరుచులకు, బడ్జెట్కు అనుగుణంగా కార్లు కొనుగోలు చేసేవారు.
కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నవారు విశాలంగా ఉండే ఎస్యూవీలపై క్రేజ్ పెంచుకుంటున్నారు. ఫలితంగా నిత్యం ఎస్యూవీ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇన్పుట్ కాస్ట్ తగ్గడంతోపాటు ఎస్యూవీలకు గిరాకీ పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో మారుతి సుజుకి అదరగొట్టింది. మొత్తం మారుతి సుజుకి కార్ల సేల్స్లో 80 శాతం ఎస్యూవీలదే కావడం గమనార్హం. బ్రెజా, ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి పాపులర్ మోడల్స్ విక్రయాలతో మారుతి సుజుకి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3717 కోట్ల నికర లాభం గడించింది.
ప్రస్తుతానికి ఎస్యూవీ కార్లపై మోజు ఉన్నా.. ఫస్ట్టైం కార్ల కొనుగోలు దారులకు కొనుగోలు ఖర్చు భారీగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఎస్యూవీ కార్లలో సబ్సెగ్మెంట్లు పెరుగుతున్నాయి. బ్రెజా, ఫ్రాంక్స్ మోడల్ కార్లకు డిమాండ్ పెరుగుతుంటే ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో తదితర మోడళ్లకు గిరాకీ తగ్గుతున్నది.
ఈ పరిస్థితుల్లో బుల్లికార్ల విక్రయాల పెరుగుదలపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమయంలోనైనా బుల్లి కార్లకు గిరాకీ పెరగవచ్చునన్నారు. బుల్లికార్లపై కేంద్రం పన్ను భారం తగ్గించకపోతే ఎవరేం చేయలేరన్నారు. ప్రభుత్వం పన్నులు తగ్గించకున్నా, కార్ల తయారీ ఖర్చులతో పోలిస్తే కస్టమర్ల ఆదాయాలు పెరగకున్నా, బుల్లి కార్లకు డిమాండ్ రాదన్నారు. తాము కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లను తయారు చేస్తామన్నారు.