CAG | భూమి లోపల నల్ల బంగారం ఉన్నట్టు బయటపడింది. ఎలాంటి పోటీ లేకుండా కారు చౌకగా దాన్ని దక్కించుకోవాలనుకొన్నది ఓ వ్యాపార సంస్థ. ఆలోచన వచ్చిందే తడవుగా డొల్ల కంపెనీలను సృష్టించి, వాటితో టెండర్లు వేయించింది. దీంతో తాము అనుకొన్న ధరకు ఆ బొగ్గు గని చౌకగా ఆ సంస్థ సొంతమైంది. అయితే, బిడ్డింగ్లో అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. అయితే, ప్రభుత్వం దీనిపై నోరుమెదపలేదు. దీంతో ఆ వ్యాపార సంస్థ గత ఎనిమిదేండ్లుగా బొగ్గు తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ మేరకు ది రిపోర్టర్స్ కలెక్టివ్ (టీఆర్సీ) మీడియా ఆర్గనైజేషన్ ఓ సంచలన నివేదికను ప్రచురించింది. టీఆర్సీ ఆరోపణలు చేసిన ఆ సంస్థ పేరు ‘ఆర్పీ-సంజీవ్ గోయెంకా’ గ్రూప్.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పశ్చిమ బెంగాల్లోని సరిసటొల్లి బొగ్గు గని వేలంలో అవకతవకలు జరిగాయంటూ ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ (టీఆర్సీ) మీడియా ఆర్గనైజేషన్ ఓ సంచలన నివేదికను బహిర్గతం చేసింది. బిడ్డింగ్లో పోటీలేకుండా చేయడానికి, వేలంలో బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి ఆర్పీ-సంజీవ్ గోయెంకా (ఆర్పీ-ఎస్జీ) గ్రూప్ డొల్ల కంపెనీలను సృష్టించిందని ఆరోపించింది. వేలంలో అవకతవకలు జరిగాయంటూ.. 2016లో అప్పటి బీజేపీ ప్రభుత్వానికి కాగ్ నివేదిక కూడా సమర్పించినప్పటికీ, దీనిని పట్టించుకోలేదు. ఈ బొగ్గు గనులను తమ అనుచరగణానికి అప్పనంగా అప్పజెప్పింది. కాగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వేలాన్ని రద్దు చేస్తారని అనుకున్నప్పటికీ, ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మేరకు ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ‘అల్ జజీరా’ ఓ కథనాన్ని ప్రచురించింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన 204 బొగ్గు గనుల లీజు ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2014లో ఆయా ఒప్పందాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అనంతరం.. అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు ఒప్పందాలు రైద్దెన బొగ్గు గనులకు మళ్లీ పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా బెంగాల్లోని సరిసటొల్లి బొగ్గు గనితో పాటు మరో 10 బొగ్గు గనులకు వేలం నిర్వహించింది. అయితే, సరిసటొల్లి బొగ్గు గని వేలం ప్రక్రియలో పాల్గొనడానికి కేంద్రం ఎంపిక చేసిన ఐదు కంపెనీల్లో మూడు కంపెనీలు ఆర్పీ-ఎస్జీ గ్రూప్నకు చెందినవే కావడం విశేషం. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో వెల్లడైనట్టు టీఆర్సీ తెలిపింది.
టీఆర్సీ నివేదిక ప్రకారం.. వేలంలో పోటీలేకుండా ఉండేందుకు ఆర్పీ-ఎస్జీ గ్రూప్ మరో రెండు డొల్ల కంపెనీలతో టెండర్లు వేయించింది. బిడ్డింగ్కు ముందే వాటిని కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసింది. బిడ్డింగ్లో పాల్గొన్న ఐదు కంపెనీల్లో ఆర్పీ-ఎస్జీ గ్రూప్నకు చెందిన కోల్కత్తా ఎలక్ట్రిసిటీ సైప్లె కార్పొరేషన్ (సీఈఎస్సీ) దూకుడుగా వ్యవహరించింది. ఆర్పీ-ఎస్జీకి చెందిన మరో రెండు డొల్ల కంపెనీల్లో ఒక కంపెనీ అసలు బిడ్డింగే వేయలేదు. మరో కంపెనీ ఆర్పీ-ఎస్జీ కంపెనీ ఐపీ అడ్రస్ నుంచే బిడ్ వేసింది. మిగతా రెండు కంపెనీల్లో ఒకటి ఒకసారి బిడ్ దాఖలు చేసి కనుమరుగవ్వగా, మరో కంపెనీ చివరి వరకూ వేలంలో పాల్గొంది. చివరకు సరిసటొల్లి బొగ్గు గనిని సీఈఎస్సీ చేజిక్కించుకున్నట్టు టీఆర్సీ నివేదికలో వెల్లడించింది.
సరిసటొల్లి బొగ్గు గనితో పాటు మరో 10 బొగ్గు గనులకు వేసిన వేలం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాగ్ పేర్కొంది. వేలం ప్రక్రియలో కంపెనీల మధ్య పోటీ.. ఉండాల్సిన రీతిలో లేదని అభిప్రాయపడింది. దీంతో చవగ్గా బొగ్గు గనులు సదరు కంపెనీలకు చేరాయని, ప్రభుత్వ ఖజానాకు ఇది నష్టదాయకమని పేర్కొన్న కాగ్.. ఆగస్టు 2016లో పార్లమెంట్కు నివేదికను సమర్పించినట్టు టీఆర్సీ తెలిపింది. కొన్ని నెలల తర్వాత దీనిపై అంతర్గతంగా చర్చించిన బీజేపీ సర్కారు.. వేలంలో అవకతవకలు జరిగినట్టు ఒప్పుకున్నదని టీఆర్సీ పేర్కొంది. అయితే, కాగ్ పేర్కొన్న 11 బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయని మోదీ సర్కారు.. ఆ తర్వాత వేలం నిబంధనల్లో సవరణలు చేసినట్టు టీఆర్సీ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటివరకూ.. ఆర్పీ-ఎస్జీ గ్రూప్ సరిసటొల్లి బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతున్నది.
పూర్తి పేరు: రామప్రసాద్-సంజీవ్ గోయెంకా గ్రూప్ (ఆర్పీ-ఎస్జీ గ్రూప్)
ప్రారంభం: 13 జూలై 2011
వ్యవస్థాపక చైర్మన్ : సంజీవ్ గోయెంకా
ప్రధాన కార్యాలయం: కోల్కతా
వ్యాపార విస్తరణ: భారత్, బంగ్లాదేశ్
ఉద్యోగులు: 44,500
ఆదాయం: రూ. 33 వేల కోట్లు
వ్యాపార రంగాలు:పవర్, ఐటీ, ఎడ్యుకేషన్, రిటైల్, మీడియా