Data Leak | వివిధ దేశాల ప్రభుత్వాలు, టెక్నాలజీ రంగ సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా ఇంటర్నెట్ యూజర్లు, అమెరికాతోపాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాల డేటాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే సెక్యూర్ పేజీలో ఉందని చెప్పారు.
చైనా మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డ్ ఇన్, ఎక్స్ డాట్ కామ్, టెలిగ్రామ్తోపాటు ట్విట్టర్, డ్రాప్ బాక్స్ వంటి వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజర్ల నుంచి ఈ డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల పరిశోధకులు తెలిపారు. ఇలా తస్కరణకు గురైనా డేటా మొత్తం 12 టెరాబైట్స్ ఉంటుందని ఫోర్బ్స్ పేర్కొంది. ఈ డేటా బేస్ను ఒక డేటా బ్రోకర్ గానీ, ఒక సైబర్ ఫ్రాడ్స్టర్ గానీ కంపైల్ చేసి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
తస్కరణకు గురైన డేటాలో సదరు యూజర్ల ఖాతాల పేర్లు, పాస్వర్డ్లు కూడా ఉండటం ఆందోళనకరం అని యూజర్లు చెప్పారు. కనుక ఇంటర్నెట్ యూజర్లు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ డేటాను సైబర్ మోసగాళ్లు ఐడెంటిటీ థెఫ్ట్తోపాటు ఫిషింగ్ స్కీమ్స్, సైబర్ అటాక్స్, వ్యక్తిగత-సున్నితమైన డేటాలోకి అనధికారికంగా చొచ్చుకువెళ్లేందుకు ఉపయోగించే చాన్స్ ఉందని పరిశోధకులు తెలిపారు.
గతంతో పోలిస్తే తక్కువ డేటాను తస్కరించినా, సైబర్ మోసగాళ్ల గురించి తక్కువ అంచనా వేయొద్దని ఈఎస్ఈటీలో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ మూర్ తెలిపారు. బాధితులు తక్షణం అప్రమత్తమై తస్కరణకు గురైన పాస్ వర్డ్ లతో జరిగే దుష్పరిణామాలను గుర్తించి తగిన సెక్యూరిటీ అప్ డేట్స్ చేసుకోవాలని సూచించారు.