ముంబై, అక్టోబర్ 27: మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,716.5 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,061.54 కోట్ల లాభం కంటే 80.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
ప్రస్తుత పండుగ సీజన్లో వాహనాలు అమ్మకాలు పుంజుకోవడం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడం, అదనపు ఖర్చులు తగ్గించుకోవడం, ఆపరేటింగేతర ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.28,543.50 కోట్లుగా నమోదైన కంపెనీ విక్రయాలు గత త్రైమాసికానికిగాను రూ.35,535.1 కోట్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో సంస్థ 5,52,055 కార్లను దేశీయంగా విక్రయించింది.