CNG Car Cheap | సీఎన్జీ కారు చౌకగా అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త ప్లాన్ బయట పెట్టింది. ఆవు పేడతో వచ్చే బయోగ్యాస్ను సీఎన్జీ కారు డ్రైవింగ్కు ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ- నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)తోనూ, ఆసియాలోకెల్లా అతిపెద్ద డెయిరీ మాన్యుఫాక్చరర్ `బనాస్ డెయిరీ`తోనూ మారుతి సుజుకి ఒప్పందాలు చేసుకున్నది. అలాగే జపాన్లో ఆవుపేడ ప్రాసెసింగ్ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ఫుజిసాన్ అసగిరి బయోమాస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
`2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్ వృద్ధి చెందుతుంది. నాటి వరకు కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలు లభించవు. ఆయా ఇంధన ఉత్పత్తుల నుంచి CO2 ఉద్గారాలను పూర్తిగా తొలగించాలి. కర్బన ఉద్గారాల వినియోగం తగ్గింపునకు, పెరుగుతున్న కార్ల విక్రయానికి మధ్య బ్యాలెన్సింగ్ చేయాలి` మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది.
`భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆవుపేడ, బయోగ్యాస్ తేలిగ్గా లభిస్తాయి. దాన్ని తయారు చేసి సరఫరా చేయాలి. కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ సీఎన్జీ కార్లలో బయోగ్యాస్ లేదా ఆవుపేడ ఆధారిత బయోగ్యాస్ వినియోగంలోకి తెస్తాం` అని మారుతి సుజుకి తెలిపింది. బయోగ్యాస్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, బనాస్ డెయిరీలతో ఎంవోయూలపై మారుతి సుజుకి ఇండియా సంతకాలు చేసింది.
భారత్తోపాటు వ్యవసాయ ఆధారిత జపాన్, ఏషియాన్ కంట్రీస్, ఆఫ్రికా దేశాల్లో ఆవుపేడ, బయోగ్యాస్ను సీఎన్జీ గ్యాస్ కార్లలో వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది మారుతి సుజుకి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఫ్యూచర్ టెక్నాలజీస్, మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ కోసం జపాన్లోని సుజుకి హెడ్క్వార్టర్స్లో గల యొకొహమా ల్యాబ్, భారత్లోని ఆర్ అండ్ డీ సెంటర్, మారుతి సుజుకి పరస్పరం సహకరించుకుంటాయి.