న్యూఢిల్లీ, జనవరి 31: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,207 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,406 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.33, 513 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.29,251 కోట్లుగా ఉన్నది.
గత త్రైమాసికంలో సంస్థ 5,01,207 యూనిట్ల కార్లను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించిన 4,65,911 యూనిట్లతో పోలిస్తే 8 శాతం అధికం.
చిన్న కార్లకు డిమాండ్ అంతకంతకు పడిపోయినప్పటికీ దేశీయంగా సంస్థ 4,29,422 యూనిట్ల వాహనాలను విక్రయించడం విశేషం.
71,785 యూనిట్ల వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 15,51,292 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 13,46,965 యూనిట్లు కాగా, 2,04,327 కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
గత తొమ్మిది నెలల్లో రూ.1,03,387 కోట్ల ఆదాయంపై రూ.9,536 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.