Maruti Price Hike | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోదఫా కార్ల ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. స్టీల్, అల్యూమినియం తదితర ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతో కార్ల ఉత్పత్తి వ్యయంలో కొంతభాగం కొనుగోలుదారులపై మోపేందుకు సమాయత్తం అవుతున్నది. గతేడాది జనవరి నుంచి నాలుగు సార్లు మారుతి సుజుకి కార్ల ధరలు దాదాపు తొమ్మిది శాతం పెరిగాయి. ఏడాది కాలంలో అత్యధికంగా కార్ల ధరలు పెంచిన సంస్థగా మారుతి నిలుస్తుంది. ఈ ఏడాది జనవరిలో అన్ని రకాల కార్ల ధరలు సగటున 1.7 శాతం పెంచేసింది.
గతేడాది ఏప్రిల్లో ఎంపిక చేసిన మోడల్ కార్లపై 1.6, సెప్టెంబర్లో 1.9 శాతం పెంచేసింది. మారుతి కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్తోపాటు అన్ని రకాల సీఎన్జీ వేరియంట్లపై రూ.15 వేల వరకు ధర పెరిగింది. భారీగా పెరిగిన ముడి సరుకు ధరలతో కంపెనీ లాభాలపై ఒత్తిడి పడుతున్నది. పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నామని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా ఇంతకుముందే ప్రకటించాయి. అన్ని రకాల వాణిజ్య వాహనాలపై 2-2.5 శాతం వరకు ధర పెంచుతున్నట్లు గత నెల 22న టాటా మోటార్స్ తెలిపింది. స్టీల్, అల్యూమినియంతోపాటు అరుదైన లోహాలు, ఇతర ముడి సరుకు ధరలు పెరగడంతో వాణిజ్య వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని రెగ్యులేటరీ ఫైలింగ్లో టాటా మోటార్స్ వెల్లడించింది.
ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని రకాల కార్ల ధరలు మూడు శాతం పెంచేస్తున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతో కార్ల ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతోపాటు కొన్ని నెలలుగా ముడి సరుకుల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. కార్ల తయారీలో ముడి సరుకుల కొనుగోలుకు అయ్యే ఖర్చు 75-78 శాతంగా ఉంటుంది. 2020 నుచి స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, రాగి, రోడియం, ప్లాటినం తదితర లోహాల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.