Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దూసుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే ఎనిమిదేండ్లలో ప్రతిఏటా 40 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇందుకోసం రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని మంగళవారం జరిగిన సంస్థ వాటాదారుల వార్సిక సమావేశం (ఏజీఎం)లో తెలిపారు.
మున్ముందు వేర్వేరు ఫ్యూయల్ బేస్డ్ వెహికల్స్ను మార్కెట్లోకి తెస్తామని ఆర్సీ భార్గవ తెలిపారు. ఇప్పటికే సంప్రదాయ పెట్రోల్తోపాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తెస్తున్న మారుతి సుజుకి.. మున్ముందు హైబ్రీడ్, ఇథనాల్, బయోఫ్యూయల్, కంప్రెస్డ్ బయో గ్యాస్తో నడిచే కార్లను తెస్తామన్నారు. అయితే వచ్చే ఎనిమిదేండ్లలో వచ్చే టెక్నాలజీ మార్పులను ఇప్పుడే అంచనా వేయలేమని తేల్చేశారు.
గత 40 ఏండ్లలో 20 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న మారుతి సుజుకి.. వచ్చే ఎనిమిదేండ్లలోనే మొత్తం 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం సంపాదించుకుంటుందని తెలిపారు ఆర్సీ భార్గవ. మున్ముందు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా 28 రకాల కార్లను ఆవిష్కరిస్తామని చెప్పారు.