Maruti on Small Cars | కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగితే చిన్న కార్ల తయారీ నుంచి తప్పుకోక తప్పదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ప్రయాణికుల కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేయడంతోపాటు కేంద్రం పలు విధాన నిర్ణయాలు తీసుకున్నది. కేంద్రం నిర్ణయాలతో సామాన్యుడికి కార్లు దూరం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రయాణికుల భద్రతకు ఎనిమిది మంది ప్రయాణికుల కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చేశారు.
దీనిపై ఆర్సీ భార్గవ స్పందిస్తూ.. ఆరు ఎయిర్బ్యాగ్ల వల్ల కార్ల తయారీ ఖర్చు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు తప్పనిసరి ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నది. ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వ చర్య ఫలితమివ్వదని ఆర్సీ భార్గవ చెప్పారు.
ఒకవేళ ఆరు ఎయిర్బ్యాగ్ల పాలసీ అమల్లోకి వస్తే చిన్న కార్ల తయారీ లాభదాయకం కాదు.. మేం వాటి తయారీ నుంచి తప్పుకుంటాం అని ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఆర్సీ భార్గవ చెప్పారు. చిన్న కార్ల క్యాటగిరీలో తమ సంస్థ గణనీయ లాభాలేమీ గడించడం లేదన్నారు.
వివిధ కారణాలతో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి గతేడాది తన స్థానాన్ని కోల్పోయింది. తిరిగి మార్కెట్పై పట్టు పెంచుకునేందుకు పెద్ద కార్లు, నూతన ఎస్యూవీ కార్ల తయారీపై దృష్టి సారించామని ఆర్సీ భార్గవ చెప్పారు.