Maruti Suzuki-Audi | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజురోజుకు కార్లకు గిరాకీ పెరుగుతున్నది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో కార్ల తయారీకి ఉపయోగించే కమొడిటి ఖర్చులు పెరుగుతుండటంతో మరోమారు వివిధ మోడల్ కార్ల ధరలు పెరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. మారుతి సుజుకి.. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. 2024 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించాయి. ఆడి కార్ల ధరలు రెండు శాతం పెరగనుండగా, మారుతి సుజుకి ఎంత మేరకు పెంచుతామో వెల్లడించలేదు.
మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో మొదలు మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకూ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. `ద్రవ్యోల్బణం ప్రభావంతో పెరిగిన ఖర్చులు, కమొడిటీ ధరలు పెరిగిపోయాయని. దీనివల్ల 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మా కార్ల ధరలు పెంచాలని ప్రణాళిక రూపొందించాం’ అని మారుతి సుజుకి సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘కార్ల తయారీ ఖర్చులు తగ్గించడానికి గరిష్టంగా చర్యలు చేపట్టాం. కానీ మార్కెట్లో ఖర్చులు పెరుగుతుండటంతో అన్ని మోడల్ కార్ల ధరలు కొంత మేర పెంచక తప్పడం లేదు’ అని పేర్కొంది.
ఆపరేషనల్ కాస్ట్స్, ఇన్ పుట్ వ్యయం పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని మోడల్ కార్లపై జనవరి ఒకటో తేదీ నుంచి రెండు శాతం ధరలు పెంచుతామని ఆడి ఇండియా తెలిపింది. ‘సప్లయ్ చైన్ ఖర్చులు పెరిగాయి. ఆపరేషనల్ కాస్ట్స్ ఎక్కువయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మేం మా కార్ల ధరలు పెంచక తప్పలేదు. ఆడి ఇండియా, మా డీలర్ల సుస్థిర గ్రోత్ సాధించేందుకు ధర పెంచాల్సి వస్తోంది. కస్టమర్లపై ధరల పెంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆడి ఇండియా ‘క్యూ3` ఎస్యూవీ నుంచి స్పోర్ట్స్ కారు ‘ఆర్ఎస్ క్యూ8’ వరకూ రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది.