న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ధరలు పెంచనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
వివిధ రకాల ముడి సరుకు, విడి భాగాలతో సహా ఇన్పుట్ వ్యయం పెరిగిపోవడంతో వాహనాల తయారీపై భారం పడుతున్నదని మారుతి సుజుకి పేర్కొన్నది. ఈ పరిస్థితుల్లో కార్ల కొనుగోలు దారులపై అదనపు భారం మోపక తప్పడం లేదన్నది. అందువల్లే కార్ల ధరలు పెంచుతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
వివిధ మోడల్ కార్ల ధరల పెరుగుదలలో తేడాలు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండుసార్లు మారుతి సుజుకి కార్ల ధరలు పెంచివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 16న అన్ని మోడల్ కార్ల ధరలు 1.6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు ఈ ఏడాది జనవరి 18న తొలిసారి ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు రూ.34 వేలు పెంచుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వ్యాఖ్యానించింది.
మారుతి సుజుకి (ఎంఎస్ఐ) ఎంట్రీ లెవల్ హ్యాబ్బ్యాక్ ఆల్టో నుంచి ఎస్-క్రాస్ మోడల్ కార్లను విక్రయిస్తున్నది. వీటి ధరలు రూ.2.99 లక్షల నుంచి రూ.12.39 లక్షల మధ్య ఉన్నాయి.