న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ మరోసారి కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మే నెల నుంచి ఇప్పటి వరకు ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. ఉత్పత్తి వ్యయాలు అధికం కావడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్లనే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.
గత రెండు సార్లుగా అన్ని మాడళ్ల ధరలను సవరించిన సంస్థ..ఈసారి మాత్రం ఎంపిక చేసిన మాడళ్లకు మాత్రమే వర్తించనున్నదని వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ధరల పెంపు అనివార్యమైందని పేర్కొంది. అయితే, ద్రవ్యోల్బణ భారాలు అధికంగా ఉండటం, ప్రతికూల వ్యయాలు కొనసాగుతుండటంతో వినియోగదారులపై స్వల్ప భారం మోపినట్టు వెల్లడించింది.