Maruti Suzuki | గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో విదేశాలకు కార్లు ఎగుమతి చేసిన మారుతి సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల మార్కును దాటుందని విశ్వాసంతో ఉంది. 2030 నాటికి ఎనిమిది లక్షల కార్ల వరకూ ఎగుమతి చేస్తుందని మారుతి సుజుకి ఇండియా కార్పొరేట్ ఎఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి చెప్పారు.
‘మూడేండ్ల క్రితం వరకూ విదేశాలకు లక్ష నుంచి 1.2 లక్షల వరకూ కార్లు ఎగుమతి చేశాం. జాతీయ విజన్, వ్యాపార ఆకాంక్షలకు అనుగుణంగా గత పరిస్థితిని అధిగమించాలని నిర్ణయించా. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.59 లక్షలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2.83 లక్షల కార్లు ఎగుమతి చేశాం’ అని రాహుల్ భారతి పీటీఐతో అన్నారు. గతేడాది విదేశాలకు కార్ల ఎగుమతిలో 9.3 శాతం పురోగతి సాధించామన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42 శాతం మారుతి సుజుకివేనన్నారు.
ప్రస్తుతం తయారు చేస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ కార్లతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కూడా ప్రారంభం అవుతుందని రాహుల్ భారతి చెప్పారు. జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి అభివ్రుద్ధి చెందిన దేశాలకు ‘ఈవీ కార్లు’ కూడా ఎగుమతి చేస్తామన్నారు. నిత్యం తమ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ 2030 నాటికి మొత్తం 7.5 లక్షల నుంచి 8 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. 100 దేశాలకూ అన్ని మోడల్ కార్లు ఎగుమతి చేయడం లేదని, ఎగుమతులను పెంచడంతోపాటు పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు.
మారుతి సుజుకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,83,067 కార్లు విదేశాలకు ఎగుమతి చేసింది. 2022-23లో 2,59,333 కార్లు, 2021-22లో 2,38,376 కార్లు ఎగుమతి చేసింది. 2020-21లో కేవలం 96,139, 2019-20లో 1,02,171, 2018-19లో 1,08,749 కార్లు ఎగుమతి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఐవరీ కోస్ట్ వంటి దేశాలకు ఎగుమతులు చేసింది మారుతి సుజుకి. ఆయా దేశాలకు మారుతి బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా మోడల్ కార్లు ఎక్కువగా ఎగుమతి చేసింది.