Maruti Suzuki | దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల పరిధిలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్లో `ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్)` మోడల్ కార్లకు గిరాకీ పెరుగనున్నదని మారుతి సుజుకి (Maruti Suzuki) అంచనా వేసింది. వచ్చే ఏడాది (2023)లో ఆటో గేర్ షిఫ్ట్ మోడల్ కార్ల సేల్స్ భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. తొలిసారి 2013-14లో సెలెరియో మోడల్ కారులో తొలుత ఏజీఎస్ వ్యవస్థను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు తొమ్మిది మోడల్ కార్లలో ఈ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది.
ఏజీఎస్ సిస్టమ్ వల్ల డ్రైవర్గా గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గేర్ మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మారుతి సుజుకి ఏజీఎస్తో కూడిన 7.74 లక్షల కార్లు విక్రయించింది. `మేం ఏజీఎస్ వ్యవస్థను ప్రవేశ పెట్టిన వివిధ మోడల్ కార్లకు విస్తరించాం. ప్రత్యేకించి పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నా కొద్దీ తేలిగ్గా డ్రైవింగ్ చేయడానికి ఏజీఎస్ వ్యవస్థ గల కార్లు ఉపయుక్తంగా ఉంటుంది. కార్లలో ఏజీఎస్ వ్యవస్థను టెక్నాలజీ మరింత ముందుకు తీసుకెళుతుంది` శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. సెలేరియోతో ఏజీఎస్ సిస్టమ్ను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఆల్టో కే-10, వ్యాగనార్, డిజైర్, ఇగ్నిస్, బ్రెజా, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బాలెనో మోడల్ కార్లకూ విస్తరించింది.
మారుతి సుజుకి విక్రయిస్తున్న కార్లలో వాటి మోడల్ ఆధారంగా 12-23 శాతం మధ్య ఏజీఎస్ యూనిట్లు అమ్ముడవుతున్నాయని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. గరిష్టంగా సెలేరియోలో రెండు లక్షల యూనిట్లు ఏజీఎస్ యూనిట్లు విక్రయించామన్నారు. తర్వాతీ స్థానంలో వ్యాగనార్ 1.39 లక్షలు, స్విఫ్ట్ 1.24 లక్షలు, డిజైర్ 1.01 లక్షలు, ఆల్టో కే-10 మోడల్ 68 వేలు, ఇగ్నిస్ 49 వేలు, బ్రెజా 39 వేలు, బాలెనో 20 వేల ఏజీఎస్ యూనిట్లు విక్రయించామని చెప్పారు. మొత్తం వివిధ మోడల్ కార్లలో ఏజీఎస్ వ్యవస్థ గల 7.74 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయన్నారు.
ఏజీఎస్ టెక్నాలజీకి గిరాకీ పెరుగడానికి తక్కువ ఖర్చు ఉండటం వల్లేనని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కారు మోడళ్లలో సాధారణ ట్రాన్స్మిషన్ లేదా ఏజీఎస్ వేరియంట్ కార్లలో తేడా కేవలం రూ.50 వేలు మాత్రమేనని అన్నారు. పవర్ స్టీరింగ్ ముందుగా ప్రీమియం ఫీచర్గా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కస్టమర్లు ఎక్కువ ధర చెల్లించడానికి మొగ్గు చూపుతుండటంతో అన్ని మోడల్ కార్లలో ఏజీఎస్ సిస్టమ్ స్టాండర్డ్గా పరిగణిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పవర్ స్టీరింగ్కు మొగ్గుచూపుతున్నారని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.