Maruti Suzuki | పర్యావరణ పరిరక్షణ కోసం మరింతగా కాలుష్య నియంత్రణ ప్రతి ఒక్కరి ఆకాంక్ష.. అభిమతం. సంకల్పం. సంకల్పం.. అభిమతం ఉండగానే సరిపోదు.. అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలి.. ఆ దిశగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి అడుగులేస్తున్నది. ఆవు పేడతో వచ్చే బయోగ్యాస్ ద్వారా ఉద్గారాలు తగ్గించవచ్చునని భావిస్తున్నది. సీఎన్జీ, బయోగ్యాస్, ఇథనాల్ వంటి కార్బన్-న్యూట్రల్ ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ గల కార్లలో ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ వినియోగం సాధ్యాసాధ్యాలపై మారుతి సుజుకి సీరియస్గా కృషి చేస్తున్నది. `2030 కోసం వృద్ధి వ్యూహం` అనే అంశంపై మారుతి సుజుకి సమర్పించిన ప్రజంటేషన్లో ఈ సంగతి తెలిపింది.
`మేం ఫుల్ రేంజ్ ప్రొడక్ట్స్, సర్వీసులు అందించాలని భావిస్తున్నాం. బ్యాటరీ ఆధారిత ఈవీలు మాత్రమే కాక సీఎన్జీ, బయోగ్యాస్, ఇథనాల్, మిక్స్డ్ ఫ్యూయల్స్ వాడకంతో కార్బన్ న్యూట్రల్ కంబుష్టన్ ఇంజిన్లతో నడిచే కార్లను అందించ తలపెట్టాం` అని మారుతి సుజుకి తెలిపింది. `గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వెలువడే డెయిరీ వ్యర్థాలు, ఆవు పేడ నుంచి వచ్చే బయోగ్యాస్ను దారి మళ్లించడం ద్వారా బయోగ్యాస్ బిజినెస్కు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి మారుతి సుజుకి ఏకీకృత ఇన్సియేటివ్ తీసుకుంటున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఆవుపేడ, ఇతర డెయిరీ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి సరఫరా చేయొచ్చు. ఆవుపేడ, ఇతర డెయిరీ వ్యర్థాలతో ఉత్పత్తి చేసే బయో గ్యాస్తో మారుతి సుజుకి సీఎన్జీ మోడల్ కార్లకు ఉపయోగించవచ్చు. అదే జరిగితే దాదాపు 70 శాతం సీఎన్జీ కార్ మార్కెట్లకు ఈ బయోగ్యాస్ సరిపోతుందని మారుతి సుజుకి చెబుతున్నది. ఈ ప్రాజెక్టును భారత్కు మాత్రమే పరిమితం చేయడం లేదు. భవిష్యత్లో జపాన్, ఆఫ్రికా, ఆసియా ఖండ దేశాలతోపాటు ఇతర వ్యవసాయ ఆధారిత దేశాలకూ ఈ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని సంకల్పించింది.