Maruti Cars Costly | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకితోపాటు టాటా మోటార్స్ కమర్సియల్ వెహికల్స్ ధరలు వచ్చే నెల నుంచి మరింత పిరం కానున్నాయి. అన్ని రకాల కార్ల ధరలు వచ్చే నెల నుంచి పెరుగుతాయని మారుతి సుజుకి గురువారం ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతోపాటు రెగ్యులేటరీ నియంత్రణలు పాటించాల్సి రావడంతో కార్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతున్నదని వెల్లడించింది. మారుతి సుజుకి కార్ల ధరలు పెంచడం రెండు నెలల్లో ఇది రెండోసారి. పెంచిన కార్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎంత పెరుగుతుందన్న సంగతి ప్రకటించనప్పటికీ మోడల్స్, క్యాటగిరీ, సెగ్మెంట్ వారీగా కార్ల ధరలు పెరుగుతాయని స్పష్టంచేసింది.
ఇన్ పుట్ కాస్ట్ వ్యయం పెరిగిపోయిందన్న పేరుతో మారుతి సుజుకి గత జనవరి 16న అన్ని రకాల కార్ల ధరలు 1.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే హోండా కార్స్, హీరో మోటో కార్ప్ సైతం తమ కార్లు, మోటార్ బైక్స్, స్కూటర్ల ధరలు పెంచుతామని ప్రకటించాయి.
ఇదిలా ఉంటే అన్ని రకాల కమర్షియల్ వెహికల్స్ ధరలు ఐదు శాతం పెంచుతున్నట్లు బుధవారం టాటా మోటార్స్ ప్రకటించింది. పెంచిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనికి తోడు ఉత్పాదక ఖర్చులు పెరగడం కూడా వాహనాల ధర పెంపునకు కారణం అని టాటా మోటార్స్ పేర్కొంది. ఉత్పాదక వ్యయం పెరిగిపోతున్నదన్న పేరుతో గత నెలలో టాటా మోటార్స్ అన్ని కార్ల ధరలు పెంచేసింది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్-6 ఫేస్-2 దశ కర్బన ఉద్గారాల నిబంధనలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాహనాల తయారీ సంస్థలు అమలు చేయాల్సి ఉంది. బీఎస్-6 2.0ను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఎఫ్) ప్రమాణాలను ఆటోమోబైల్ సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.