Maruti Brezza | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎస్యూవీ బ్రెజా టాప్ హై ఎండ్ మోడల్ కార్లలో మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ వేరియంట్లను తిరిగి మార్కెట్లో ఆవిష్కరించింది. 1.5 లీటర్ల కే15సీ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్తో మారుతి బ్రెజా జడ్ఎక్స్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్, జడ్ఎక్స్ఐ+ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్రిమ్స్ వస్తున్నాయి. గతేడాది జూలైలో మైల్డ్ హైబ్రీడ్ వేరియంట్ బ్రెజాలను మార్కెట్ నుంచి నిశ్శబ్ధంగా ఉపసంహరించిన మారుతి.. ఇప్పుడు టాప్హై ఎండ్ వేరియంట్లలో ఎక్స్క్లూజివ్గా మార్కెట్లోకి తెస్తున్నది.
మారుతి సుజుకి జడ్ఎక్స్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ.11.05 లక్షలు, జడ్ఎక్స్ఐ+ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రూ.12.48 లక్షలకు అందిస్తున్నది. ఈ రెండు వేరియంట్ కార్ల మైలేజీ గంటకు 17.38 కి.మీ నుంచి 19.89 కి.మీలకు పెరిగింది. వీటిల్లో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, ఐడిల్ స్టార్ట్ లేదా స్టాప్, టార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లతో ఓవరాల్ ఫ్యుయల్ ఎఫిషియెన్సీని మెరుగు పరుస్తాయి.
1.5 లీటర్ల కే15సీ 4-సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 హెచ్పీ విద్యుత్, 136.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సీఎన్జీ ఐటరేషన్ వర్షన్లలో లభిస్తుందీ కారు.
2023లో ఎస్యూవీ కార్ల విక్రయాల్లో మారుతి బ్రెజా టాప్లో నిలిచింది. టాటా మోటార్స్కు చెందిన టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా స్కార్పియో వంటి కార్లను దాటేసింది. గతేడాది 1,70,600 యూనిట్ల బ్రెజా కార్లు అమ్ముడయ్యాయి.