న్యూఢిల్లీ, నవంబర్ 11: కార్ల విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో వాహనాలను ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. ప్రతి కుటుంభంలో కారు ప్రతిష్ఠాత్మకంగా మారడం, రవాణా చార్జీలు గణనీయంగా పెరుగుతుండటంతో సొంత వాహనాలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో దేశీయ ఆటోమొబైల్ సంస్థల వాహన అమ్మకాలు ప్రతినెల పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలోనూ దేశీయంగా అమ్ముడైన తొలి పది వాహనాల్లో మారుతికి చెందిన ఆరు మాడళ్లకు చోటు లభించింది. ఈ జాబితాలో టాటాకు చెందిన రెండు మాడళ్లు ఉండగా, మహీంద్రా, హ్యుందాయ్లకు చెందిన చెరో మాడల్కు చోటు దక్కింది. ఈ జాబితాలో మహీంద్రాకు చెందిన స్కార్పియో చోటు లభించడం ఇదే తొలిసారి.
గత నెలలో అమ్ముడైన టాప్-10 జాబితాల్లో హ్యుందాయ్కి చెందిన క్రెటా చివరి స్థానంలో నిలిచింది. 13,077 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది అమ్ముడైన 11,800 యూనిట్లతో పోలిస్తే 10 శాతం పెరిగాయి. హ్యుందాయ్కు చెందిన వాహనాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనం ఇదే కావడం విశేషం.
మహీంద్రాకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ మాడల్ స్కార్పియోకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. గత నెలలో 13,578 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది క్రితం అమ్ముడైన 7,438 యూనిట్లతో పోలిస్తే 83 శాతం అధికం.
ఎర్టిగాకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. గత నెలలో 14,209 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్లో నమోదైనదాంతో పోలిస్తే 5 శాతం పెరుగగా, ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 10,494 యూనిట్ల కంటే 35 శాతం అధికం.
వ్యాగన్ఆర్ను కొనుగోలుదారులు ఎగబడి కొంటున్నారు. కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడంతోపాటు సీఎన్జీలో కూడా లభించడంతో గత నెలలో ఏకంగా 22 వేల యూనిట్లు అమ్ముడై టాప్-10 జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. క్రితం ఏడాది కంటే అమ్మకాల్లో 23 శాతం పెరుగుదల కనిపించింది.