Maruti on Petrol Vehicles | రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలంటుతున్నాయ్.. దీనికి తోడు చమురు ఉత్పత్తులతో వెలువడుతున్న కర్బన ఉద్గారాలతో పర్యావరణం దెబ్బ తింటున్నది. కరోనా మహమ్మారి తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. విదేశీయులతోపాటు భారతీయులు సైతం విద్యుత్ కార్లు, బైక్లు, స్కూటర్లపై మోజు పెంచుకుంటున్నారు. విద్యుత్ వాహనాల తయారీ దారులకు.. కొనుగోలుదారులకు బెనిఫిట్లు కలిగేలా కేంద్రం కూడా పలు రాయితీలిస్తోంది. ఇప్పుడిప్పుడే దేశీయంగా విద్యుత్ వాహనాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి ( Maruti Suzuki India ) కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే 7-10 ఏండ్లలో పూర్తిగా పెట్రోల్ ‘pure petrol’ వినియోగ కార్ల తయారీ నిలిపేస్తామని ప్రకటించింది.
ఆటో మేజర్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం వచ్చే 7-10 ఏండ్లలో హైబ్రీడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్, బయో ఫ్యూయల్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నది. బీఎస్-6 కర్బన ఉద్గారాల ప్రమాణాలు అమల్లోకి తేవడంతో 2020 ఏప్రిల్ నుంచే డీజిల్ వినియోగ కార్లు, వాహనాల తయారీ నిలిపేసింది. అయితే వచ్చే మూడేండ్లలోపు అంటే 2025 నాటికి గానీ పూర్తి స్థాయిలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ను లాంచ్ చేయలేమని కూడా మారుతి సుజుకి తేల్చేసింది.
తాము పలు పర్యావరణ అనుకూల టెక్నాలజీతో పనులు ప్రారంభించాం అని మారుతి సుజుకి ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీవీ రామన్ చెప్పారు. వచ్చే దశాబ్దిలో అన్ని వాహనాలను కన్వర్ట్ చేస్తాం. అప్పుడు పూర్తి పెట్రోల్ వినియోగ వాహనాలే ఉండవు. విద్యుత్ వాహనాలైనా కావచ్చు. సీఎన్జీ లేదా బయో ఫ్యూయల్ వాహనాలైనా కావచ్చు` అని ఓ ఆంగ్ల దిన పత్రికకు సీవీ రామన్ చెప్పారు.