ఏడాదికి 10 లక్షల యూనిట్ల సామర్థ్యం తో ప్లాంట్
గురుగ్రామ్, మే 19: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. భారత్లో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని సోనిపట్ వద్ద రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల సామర్థ్యం కలిగిన యూనిట్ను నెలకొల్పుతున్నది. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కూడా. హర్యానాలో ఏర్పాటు చేస్తున్న మూడో యూనిట్ ఇదే కావడం విశేషం. వచ్చే ఎనిమిదేండ్లకాలంలో ఈ యూనిట్ సామర్థ్యం 10 లక్షల యూనిట్లకు చేరుకోనున్నది. సోనిపట్ జిల్లాలోని ఐఎంటీ ఖార్కోడా వద్ద 800 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ కోసం తొలి దశలో రూ.11 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతున్నది. 2025 నాటికి అందుబాటులోకి రానున్న తొలి దశలో 2.5 లక్షల కార్లను ఉత్పత్తి చేయనున్నది సంస్థ.
డిమాండ్కు తగ్గట్టుగానే..
దేశీయ, అంతర్జాతీయంగా కంపెనీ వాహనాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. దేశీయ అవసరాలతోపాటు ఎగుమతులు తీర్చడానికి ఈ యూనిట్ ఎంతో దోహదం చేయనున్నదన్నారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, వచ్చే ఎనిమిదేండ్లలో పెద్దగా మార్పులు వస్తాయని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.