న్యూఢిల్లీ, డిసెంబర్ 20: చిన్న, పెద్ద కార్లపై ఒకే రీతిలో పన్ను వేయడం సరికాదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న కార్లకు విశేష ఆదరణ, తగిన మార్కెట్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాంటిది చిన్న కార్లపై ప్రస్తుతం పన్నుల భారం అధికంగా ఉన్నదని, ఇది దేశీయ ఆటో రంగ వృద్ధికి విఘాతమని వ్యాఖ్యానించారు.
నిజానికి తయారీ రంగం పరుగులు పెడుతుంటేనే దేశ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో లోపాల కారణంగా వృద్ధి పడకేస్తున్నదని పెదవి విరిచారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్పై 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నది. దీనిపై అదనంగా వాహన రకాన్నిబట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్సు వేస్తున్నారు. ఇక పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్న కార్లపై 60 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాన్ని మోపుతున్నారు.