10 లక్షల మార్క్ దాటిన సంస్థ
న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాహన వినియోగదారులు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. దీంట్లోభాగంగా సీఎన్జీ, ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఏకంగా 10 లక్షల యూనిట్ల సీఎన్జీ వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సీఎన్జీ విభాగంలో తొమ్మిది మోడళ్ళను విక్రయిస్తున్నది. దీంట్లో ఆల్టో, ఎస్-ప్రెస్, వ్యాగన్ఆర్, సెలేరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ, టూర్-ఎస్ మోడళ్ళు ఉన్నాయి. భద్రత ప్రమాణాలు మెరుగ్గావుండటంతోపాటు క్లీన్, టెక్నాలజీ, పర్యావరణ హితంగా ఉండే వాహనాలను రూపొందించాలనే ఉద్దేశంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే ఈ రికార్డు సాధ్యమైందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. దేశీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా సీఎన్జీ కార్లను తయారుచేయడంతోపాటు అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,700 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయని, వచ్చే కొన్నేండ్లలో ఈ సంఖ్యను 10 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఈ తరహా వాహనాలకు డిమాండ్ అధికమవుతున్నదన్నారు.