న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: మారుతి సుజుకీ..వాహన ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల ధరలను 3 శాతం వరకు పెంచిన సంస్థ..ఈ నెలలో మరోసారి పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం స్పష్టం చేయలేదు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని, కమోడిటీ ఉత్పత్తులు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సంస్థపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆయా మోడళ్లను బట్టి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. జనవరి 2021 నుంచి మార్చి 2022 వరకు సంస్థ వాహన ధరలను 8.8 శాతం వరకు పెంచింది.