హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఖనిజాల అన్వేషణ కోసం సంస్థలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్నాలజీలను వాడుతున్న దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ తాజాగా అత్యాధునిక డ్రోన్లతో అన్వేషణ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డ్రోన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన హైదరాబాదీ స్టార్టప్ మారుట్ డ్రోన్స్తో జతకట్టింది. ఖనిజ అన్వేషణ కోసం రెండు డ్రోన్లను తయారు చేయించింది. ఒక్కో డ్రోన్ విలువ రూ.5.50 కోట్లు. ఈ సందర్భంగా మారుట్ డ్రోన్ వ్యవస్థాపకులు, సీఈవో ప్రేమ్కుమార్ మాట్లాడుతూ..100 మీటర్ల ఎత్తునుంచి భూమి లోపల కిలోమీటర్ లోతులో ఉన్న పలు రకాల ఖనిజాలను గుర్తించే సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉన్నదని తెలిపారు. భూమి మీద ఎలాంటి ప్రాంతాల్లోనైనా ఎగురుతూ లోపల ఉండే ఖనిజాలను గుర్తించనున్నది.