పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.బలమైన మార్కెట్, వ్యాపారాభివృద్ధికున్న విస్తృత అవకాశాలతో మార్స్ పెట్కేర్ ఇండియా రూ.500 కోట్లతో ప్లాంట్ విస్తరణకు ముందుక్చొంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు.. వేగంగా ఇస్తున్న అనుమతులు.. పారిశ్రామిక విస్తరణకు దోహదం చేస్తున్నాయి. సమర్థవంతమైన అధికార యంత్రాంగం కృషీ కలిసొస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పెంపుడు జంతువుల ఆహార కంపెనీ మార్స్ పెట్కేర్ ఇండియా సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని తన ఫ్యాక్టరీని విస్తరించబోతోంది. ఈ మేరకు గురువారం సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్)ను కుదుర్చుకున్నారు. ఈ విస్తరణ ద్వారా స్థానికంగా 180 నుంచి 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అదేవిధంగా పెట్ ఆహార పదార్థాల తయారీకి వినియోగించే ముడి సరుకులకు సంబంధించి కూడా స్థానికంగా వ్యాపారాలు మరింత పెరిగేందుకు దోహదపడనుంది.
మెగా ప్రాజెక్టు కేటగిరీలో ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. కంపెనీ యాజమాన్యానికి హామీ ఇచ్చారు. మార్స్ పెట్కేర్ సంస్థ ఉత్పత్తుల తయారీలో అవసరమైన ముడి పదార్థాలకు సంబంధించి కూడా రాష్ట్రం నుంచి మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలియజేశారు. అలాగే వ్యాపారపరంగా కూడా తెలంగాణ రాష్ట్రం, మార్స్ పెట్కేర్ సంస్థ మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. మార్స్ పెట్కేర్ ఇండియా ఎండీ గణేశ్ రమణి మాట్లాడుతూ.. హైదరాబాద్లో 2008లోనే తొలి ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. తయారు చేసిన ఆహారం పెంపుడు జంతువులకు అందించడంపై అవగాహన పెరగడంతో మార్కెట్ సైతం పుంజుకుంటోందన్నారు. 2019లో 16 శాతం పరిశ్రమ వృద్ధి చెందగా, 2020లో 20 శాతానికి చేరిందన్నారు. ఈ రెండేండ్లలో మార్కెట్లో సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని, 2021లోనూ మార్కెట్ షేర్ 35 నుంచి 40 శాతం వరకు పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ విస్తరణ ఇందుకు మరింత దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
పెంపుడు జంతువుల ఆహార రంగంలో పెద్ద ఎత్తున పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆసియా మొత్తం ఎగుమతులు చేసేలా ఫ్యాక్టరీని మార్స్ పెట్కేర్ ఇండియా విస్తరిస్తున్నది. ఇందులో భాగంగానే సెకండ్ డ్రై యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విస్తరణ కారణంగా ప్యాకింగ్ లైన్ కెపాసిటీ పెరగనున్నది. దీనివల్ల కేవలం దేశానికే కాకుండా ఆసియా దేశాలన్నింటికీ డ్రై పెట్ ఫుడ్ను సంస్థ అందించనున్నది. ఇక స్థానికులకు శిక్షణ ఇచ్చిమరీ ఉద్యోగాల్లోకి సంస్థ తీసుకోనున్నది. వీలైనంత వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో మహిళా సాధికారతకు సైతం ఊతమిచ్చినట్టు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా, సిద్దిపేట జిల్లాలోని గ్రామాల సంక్షేమానికి తమ వంతు సహకారాన్ని కొనసాగించనున్నట్టు సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.
ప్రముఖ బస్సు ప్రయాణ సేవల సంస్థ రెడ్బస్..హైదరాబాద్లో ‘ఆర్-జోన్’లను ఏర్పాటుచేసింది. బస్సులకోసం రోడ్ల పక్కన ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ జోన్లను నెలకొల్పింది. ఇందుకోసం టీ-హబ్లో శిక్షణ పొందిన ఎయిర్ఫైతో రెడ్బస్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు సంయుక్తంగా ఆర్-జోన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను మంత్రి కేటీఆర్ అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. బస్సుల కోసం రోడ్ల పక్కన ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఆర్-జోన్లలోనే ప్రయాణీకులు సులభంగా బస్సు ఎక్కవచ్చని తెలిపారు. ఆర్జోన్లోకి వచ్చే ప్రయాణీకులకు ఉచితంగా వై-ఫై సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో 32 చోట్ల ఆర్-జోన్లను ఏర్పాటు చేసిన సంస్థ.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరో 130 జోన్లను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు.
‘రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా.. సులభతరంగా వ్యాపారాలు ప్రారంభించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని అనుమతులు, వసతులు కల్పించడంలో ఎంతో చొరవ తీసుకుంటున్నాం. మార్స్ పెట్కేర్ ఇండియా దశాబ్దకాలంగా తెలంగాణలో విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఆ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి’
–కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ గత కొన్నేండ్లుగా అందిస్తున్న సహకారానికి కంపెనీ తరఫున కృతజ్ఞతలు. ఇక్కడి ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మరింత విస్తరిస్తుందన్న నమ్మకం నాకున్నది. ఎంతో వేగంగా కావాల్సిన అనుమతులు రావడం అభినందనీయం’
–గణేశ్ రమణి, మార్స్ పెట్కేర్ ఇండియా ఎండీ
ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ లాబొరెటరీస్ జెనెరిక్ ఔషధం కాన్గ్రెలర్కు అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఐ ఆమోదం లభించింది. యాంజియోప్లాస్టీ చేయించుకునే పేషెంట్లకు రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి రిస్క్లను తగ్గించడానికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఇప్పటికే కాన్గ్రెలర్కు భారత రెగ్యులేటర్ డీసీజీఐ అనుమతిని ఎంఎస్ఎన్ లాబ్ పొందింది. కీలకమైన అమెరికా మార్కెట్లో తాము వృద్ధి సాధించడానికి తాజా యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉపకరిస్తుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.