Investers Wealth | మకర సంక్రాంతి నాడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త లైఫ్ టైం గరిష్ట రికార్డులు నమోదు చేశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 73 వేల మార్క్ను దాటడంతో గత ఐదు సెషన్లలో దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల సంపద రూ.9.68 లక్షల కోట్లు పెరిగితే, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం ఆల్టైం హై స్థాయి రూ.376 లక్షల కోట్లకు పెరిగింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759.49 పాయింట్లు (1.05 శాతం) పెరిగి 73,327.94 పాయింట్ల ఆల్టైం రికార్డు నమోదు చేసింది. అంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్లో సెన్సెక్స్ 833.71 పాయింట్లు (1.14 శాతం) పుంజుకుని 73,402.16 పాయింట్ల గరిష్టానికి చేరుకున్నది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.9,68,544.93 కోట్లకు వృద్ధి చెంది లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ.3,76,09,510.01 కోట్లకు చేరుకున్నది.
`ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 22 వేల పాయింట్ల స్థాయిని దాటడంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఇది చారిత్రక రోజుగా పరిగణించొచ్చు. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐటీ మేజర్లు మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయడంతో ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి` అని రూపీజ్ సీఈఓ శౌర్యరామ్ గుప్తా చెప్పారు. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో మెరుగైన నికర లాభాలు గడించడంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో సోమవారం విప్రో స్టాక్ ఆరు శాతానికి పైగా లాభ పడింది. దాంతోపాటు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్పోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధితో రూ.4,350 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది.
మరోవైపు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, లార్సన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం, స్మాల్ క్యాప్ 0.11 శాతం పుంజుకుంటే, ఐటీ, టెక్ ఇండెక్స్లు 1.79 శాతం చొప్పు, ఆయిల్ అండ్ గ్యాస్ 1.70, ఇంధనం 1.66 శాతం, టెలికం 1.41 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ 0.81 శాతం లాభ పడ్డాయి. మరోవైపు, కమొడిటీస్, మెటల్ ఇండెక్స్లు నష్టాలను చవి చూశాయి.