ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల భయాలతో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, చివరకు లాభాలతో ముగిసింది. వారం మొత్తంమీద 494 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 16,266 పాయింట్ల వద్ద నిలిచింది. గత వారం కీలక మద్దతు శ్రేణిగా సూచించిన 15,700- 15,800 పాయింట్ల శ్రేణే మరోదఫా మద్దతునివ్వడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఒకసారి, మే నెలలో రెండు దఫాలు గట్టి మద్దతును అందించి, నిఫ్టీ పతనాన్ని నిలువరించిననందున ఈ శ్రేణికి సాంకేతిక ప్రాధాన్యత పెరిగింది. ఈ శ్రేణిని కోల్పోతే దీర్ఘకాలిక ట్రెండ్ సైతం బేరిష్గా మారిపోతుందని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే గత శుక్రవారం జరిగిన పెద్ద ర్యాలీలో ఒకవైపు లాంగ్ పొజిషన్ల బిల్డప్, మరోవైపు షార్ట్ కవరింగ్ జరిగినందున, ఈ వారం అంతర్జాతీయంగా అనూహ్య వార్తలేవీ వెలువడకపోతే, సూచీలు పటిష్టంగా రికవరీ అవుతాయని విశ్లేషకుడు కూనల్బోత్రా తెలిపారు. మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం కూడా మార్కెట్లో ఒడిదుడుకులుంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ హెచ్చరించారు. ఫెడ్ మినిట్స్, అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలు తదితరాలు ఈ వారం మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. సాంకేతిక అంచనాలివి…
లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్
గతవారం సూచీలు బౌన్స్ అయినా, మార్కెట్ పూర్తిగా బాటమ్అవుట్ అయ్యిందని భావించలేమని జిమిత్ మోదీ పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ వీక్లీ చార్టుల్లో హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్డౌన్ కన్పిస్తున్నందున, నిఫ్టీ పుల్బ్యాక్ ర్యాలీపై అనుమానం కలుగుతున్నదన్నారు. శుక్రవారం మొదలైన రికవరీ..రిలీఫ్ ర్యాలీగా మారే సంకేతాలు ప్రస్తుతానికి కన్పించడం లేదని తెలిపారు. దీంతో ఈ వారం నిఫ్టీ 15,700 పాయింట్ల స్థాయిని బ్రేక్ చేయనంతవరకూ ఇన్వెస్టర్లు బుల్లిష్ ధోరణిని పాటించవచ్చని సూచించారు. మార్కెట్లో ఏర్పడిన లాంగ్ పొజిషన్లతో పాటు షార్ట్ కవరింగ్ జరిగే వీలున్నందున, నిఫ్టీ 16,600 పాయింట్ల వరకూ పెరగవచ్చని కూనల్ బోత్రా అంచనా వేశారు. నిఫ్టీ 15,900 స్థాయిపైన నిలదొక్కుకుంటే తొలుత 16,400 పాయింట్ల స్థాయికి చేరవచ్చని. అటుపై 16,650 స్థాయిని అందుకోవొచ్చని వివరించారు.